హాత్ వే రాజశేఖర్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో పేరు పొందిన ప్రముఖ కేబుల్ సర్వీస్ ప్రొవైడర్ చెలికాని రాజశేఖర్ ఆకస్మికంగా మరణించారు. కేబుల్ టివి రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఉన్న రాజశేఖర్ గుండెపోటుతో మరణించారు.
1968 ఏప్రిల్ 4 న విజయనగరం జిల్లా సీతానగరం లో జన్మించిన ఆయన తొలిసారి విశాఖపట్నం లో కేబుల్ రంగంలోకి అడుగుపెట్టారు. అనతి కాలంలోనే హైదరాబాద్ వేదికగా మొదలైన హాత్ వే లో రీజినల్ హెడ్ గా బాధ్యతలు స్వీకరించారు.
హాత్ వే ను రాష్ట్రంలో ప్రముఖ నెట్ వర్క్ గా తీర్చిదిద్దారు. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో హాత్ వే కు తిరుగులేకుండా చేయడంలో ఆయనదే కీలకపాత్ర. వెంకట సాయి మీడియా ను స్థాపించి రెండు రాష్ట్రాల్లో పెద్ద నెట్ వర్క్ గా నిలిపారు.
కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే తొలిసారి ఎమ్మెస్వో ల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం శ్రమించారు.
ప్యాకేజి ల పేరుతో చానల్స్ ఎమ్మెస్వో ల ని వేధించిన సమయంలో రాజశేఖర్ అనేక ఆందోళనలు చేపట్టారు. మధ్యే మార్గంగా ఎమ్మెస్వోలు,ఆపరేటర్లు లాభపడేలా చూసారు. గుండెపోటుతో ఆయన మరణం కేబుల్ రంగానికి తీరని లోటని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.