కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కష్టకాలంలో ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తన్నీరు శ్రీనివాస్, యావపురం రవిలు అన్నారు.
సోమవారం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భౌతిక దూరాన్ని పాటిస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రెవిన్యూ అధికారి (డీఆర్వో) మధుకర్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
కరోనాతో సంక్షోభంలో పత్రికా రంగం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్డౌన్ వల్ల మీడియా (పత్రికా) రంగం తీవ్రమైన సంక్షోభంలో పడిందని మీడియా సంస్థల యాజమాన్యాలు నష్టాల పేరుతో జర్నలిస్టులను ఉద్యోగాల నుండి తొలగించడం, వేతనాలలో కోతలు విధించడం వంటి చర్యలకు పూనుకున్నాయన్నారు.
దీని వల్ల వేలాదిమంది జర్నలిస్టులు ఉద్యోగ, ఉపాధిని కోల్పోయి లాక్డౌన్లో ప్రత్యామ్నాయం లేక ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతున్నారు. చేతిలో డబ్బులు లేక చేయడానికి ఉద్యోగం లేక కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.
నెలకు రూ.10వేత ఆర్ధిక సాయం అందించాలి
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల జర్నలిస్టులు ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. అదేవిధంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం మీడియా అకాడమీ ద్వారా నెలకు రూ.10 వేల చొప్పున కనీసం నాలుగు, ఐదు నెలల పాటు సహాయం అందించాలన్నారు.
కరోనా వైరస్ నియంత్రణలో భాగస్వాములవుతున్న జర్నలిస్టులకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలన్నారు. జర్నలిస్టులందరికి ప్రభుత్వం నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలి. కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు.
మీడియా సంస్థల్లో జర్నలిస్టుల అక్రమ తొలగింపులను, వేతనాలలో కోతలను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ మీడియా సంస్థల్లో లాక్డౌన్ సందర్భంగా ఉద్యోగాల నుండి తొలగించిన జర్నలిస్టులను తిరిగి తీసుకునేలా ప్రభుత్వం యాజమాన్యాలకు ఆదేశాలివ్వాలన్నారు.
పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలి
పత్రికలకు ప్రభుత్వం జారీ చేసే వ్యాపార, వాణిజ్య, ప్రచార ప్రకటనలు విడుదల చేయాలి. ప్రకటనల సొమ్ము నుండి 10 శాతం జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఇవ్వాలి. ప్రకటనల బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కూడా శాంతియుతంగా నిరాహారదీక్ష కార్యక్రమం నిర్వహించి కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సభ్యులు మెరుగు చంద్రమోహన్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్ బెలిదే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యంపల్లి పద్మారెడ్డి, మేడ్చల్ జిల్లా కోశాధికారి కళ్యాణ్ చక్రవర్తి, సభ్యులు దూసరి రవీందర్గౌడ్, పరమేశ్వర్రెడ్డి, భాస్కర్రెడ్డి, మల్లిఖార్జున్, ఎరుబాయులు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.