అమరావతి నుంచి పరిపాలనా రాజధాని తరలింపు ఎంత వరకు వచ్చింది? ఒక అడుగు ముందుకు పడితే మూడు అడుగులు వెనక్కి పడుతున్నట్లుగా ఉంది. విశాఖపట్నానికి చెందిన మంత్రులు ప్రతి రోజూ రాజధాని ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మార్పు తథ్యం అని అంటున్నారు.
ఎవరు అడ్డుపడ్డా రాజధాని తరలింపు ఆగేది కాదని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే హైకోర్టులో రాజధాని తరలింపుపై కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మళ్లీ అందరిని ఆలోచనలో పడేస్తున్నది.
రాజధాని తరలింపు ప్రక్రియ కు భిన్నంగా జరిగిన ఈ నిర్ణయం ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందా లేక తెలియకుండా యథాలాపంగా ఒక పరిపాలనా సంబంధిత ఆదేశంగా వచ్చిందో తెలియదు కానీ ఈ నిర్ణయం వెలువడిన తర్వాత అమరావతి సచివాలయంలో పని చేస్తున్న సిబ్బంది మళ్లీ సంశయంలో పడిపోయారు.
అయోమయానికి గురి చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు
ఇక విశాఖ పట్నం తరలి వెళ్లడం ఖాయం అనుకుంటున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడిన ఈ ఆదేశాలు వారిని అయోమయానికి గురి చేశాయి. అమరావతి సచివాలయం, అసెంబ్లీ, వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలలో పని చేస్తున్న రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు అప్పటిలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్. చంద్రబాబునాయుడు ఉచిత వసతి సౌకర్యం కల్పించారు.
దాదాపుగా 800 మంది ఇలా ఉచిత వసతి సౌకర్యం అనుభవిస్తున్నారు. 2020 మార్చి నెలాఖరుతో ఈ ఉచిత వసతి సౌకర్యం గడువు ముగిసింది. గడువు ముగిసిన తర్వాత మరో నాలుగు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పటిలో నిర్ణయం తీసుకున్నది.
నాలుగు నెలల తర్వాత ఇక ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే అకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అమరావతిలో పని చేస్తున్న వీరికి ఉచిత వసతి సౌకర్యాన్ని 2021 జులై 31 వరకూ పొడిగిస్తూ ఆగస్టు 1వ తేదీన నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిలో అమరావతి నుంచి రాజధానిని తరలించే అంశం తేలదనే నిర్ణయానికి వచ్చిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏడాది పాటు ఉచిత వసతి సౌకర్యాలు పొడిగించడం ఒక వైపు నేడో రేపో అమరావతి వెళ్లిపోతామని మంత్రుల ప్రకటన మరోవైపు వస్తుండటంతో సచివాలయం ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు.