ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ విఫలమే కారణమని ఎలా చెప్తారని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి డిసిపిని ప్రశ్నించారు. దానికి సబందించి ఏవైనా ఆధారాలు ఉన్నాయా చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రవళిక ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనన్నారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని డిసిపి వెంకటేశ్వర్లు చెప్పడం దారుణమని, ప్రేమ విఫలమై చనిపోయినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా చెప్పాలని డిమాండ్ చేశారు.
గ్రూ 2 రద్దు కావడంతో ఉద్యోగం రాదన్న బెంగతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమైతే హాస్టల్ లో ఎందుకు చనిపోతుందని, ఇత్రా చోట చనిపోయే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించారు. యువత ఆత్మహత్యకు కారణం ప్రభుత్వ విధానాలు.. టీఎస్పీఎస్సి నిర్లక్ష్యమే కారణమన్నారు. గ్రూప్ 2 కోసం 10 లక్షల మంది ప్రిపేరయ్యారని, 2014 నుంచి ఇప్పటివరకు 120 నోటిఫికేషన్లు విడుదలయ్యాయని తెలిపారు. గడిచిన 26 నెలల్లో 26 నోటిఫికేషన్లు విడుదల చేసారని, దీనికోసం 6 లక్షల మంది ప్రిపేరయ్యారన్నారు. ప్రస్తుతం ఆ అరులక్షల మంది నిరుద్యోగులు రోడ్లపై ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ వైపు ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే కొంతమందికి రాజకీయమే వారికి ముఖ్యమైందన్నారు. పొన్నాల లక్ష్మయ్య చేరిక కోసం కేటీఆర్ వెళ్లారని, ప్రవళిక ఇంటికి వెళ్లి ఓదార్చే ధైర్యం కేటీఆర్ కు, ఈ నాయకులకు లేదని విమర్శించారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే అప్పుల బాధతో అని, యువత చనిపోతే ప్రేమ విఫలం అంటు ఆత్మహత్యలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక కిందిస్థాయి పోలీసులు చనిపోతున్నారని, ఉద్యోగులు సెలవుపై వెళ్తున్నారని పేర్కొన్నారు. యువత ధైర్యంగా ఉండాలిని, ఆత్మహత్య పరిష్కారం కాదని తెలిపారు.