తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లిన తర్వాత ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు అన్నారు. వైకాపా మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేదన్న ఆయన, పాత మేనిఫెస్టో నే అటు ఇటుగా రెండు, మూడు తీసేశారు తప్ప అంటూ అపహాస్యం చేశారు.
గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సమాజంలోని ఏ ఒక్క వర్గం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసే పరిస్థితే లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ, ప్రజల్ని కలుసుకోవడం జరుగుతుందన్నారు. ఇటీవల ఒక ఉపాధ్యాయురాలిని కలిసి ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించగా, ఎనిమిదేళ్ల క్రితం ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరిన తనకు రెండు లక్షల రూపాయల ఏరియర్స్ రావలసి ఉందని చెప్పారన్నారు.
ఈ లెక్కన ఉద్యోగ, ఉపాధ్యాయులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగ సంఘ నాయకుడు వెంకట్రామిరెడ్డి, అల్లరి, చిల్లర రెడ్డి లు మద్దతు తెలిపినంత మాత్రాన ఉద్యోగులంతా సపోర్ట్ చేసినట్టు కాదన్నారు. ఉద్యోగులంతా నిర్వేదంలో ఉన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 40 లక్షల మంది ఉద్యోగులు వ్యతిరేకమే
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రంలోని 40 లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు వ్యతిరేకంగా ఉన్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఉద్యోగులు వారి కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం లేదన్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం పురుషులు ఉంటే, ఒక అంచనా ప్రకారం వారిలో 60 శాతం మంది మద్యం సేవించేవారు ఉంటారన్నారు.
జనాభాలో 30% అంటే, రాష్ట్ర జనాభాలోని కోటి మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం, నాణ్యతలేని మద్యాన్ని ప్రతీ రోజూ క్వార్టర్ సేవిస్తూ తమ జేబును, ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారన్నారు . రాష్ట్రంలో మద్యం సేవించే ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే అవకాశం లేదన్నారు. ఇల్లును, ఒళ్ళును గుల్ల చేసుకున్న సాధారణ ప్రజలతో పాటు, ఉద్యోగులతో కూడా కలుపుకుంటే కోటి 20 లక్షల మంది ఉంటారన్నారు.
యువకులకు జాబ్ క్యాలెండర్ లేదు… ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు
రాష్ట్రంలోని యువకులకు జాబ్ క్యాలెండర్ లేదు. యువతకు సాంకేతిక శిక్షణ సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వం అందుబాటులో లేకుండా చేసిందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు . ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత పక్క ఊర్లకు వలస పోతున్నారు . తెలంగాణలో గత ఏడాది 3 లక్షల గ్యాస్ కనెక్షన్లు పెరిగితే, రాష్ట్రంలో తగ్గిపోయాయని అన్నారు. రాష్ట్రం నుంచి మూడు లక్షల కుటుంబాలను వలస వెళ్లే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు.
ఉద్యోగ అవకాశాలు లేక యువత తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు దాదాపు 50 లక్షల మంది ఉంటారన్న ఆయన, చదువుకోని వారికి ఏ సమస్య లేదని, ఎందుకంటే వారికి ఏదో ఒక ఉపాధి దొరుకుతుందన్నారు. బీ టెక్, ఎంటెక్ చదివిన వారికి మాత్రం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంభించిన అభివృద్ధి నిరోధక విధానం వల్ల, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయన్నారు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీని రాష్ట్రం నుంచి తరిమి వేశారని, పారిశ్రామిక అభివృద్ధి గురించి అడిగితే… బటన్ నొక్కానని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకున్న వారిని తరిమి వేస్తున్నారన్న ఆయన, ఎవరైనా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డిని కచ్చితంగా కలుసుకోవాలని షరతును విధిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి కప్పం కట్టడానికి పారిశ్రామికవేత్తలు రెడీ అయినప్పటికీ, వారితో కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరన్నారు. పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జగన్మోహన్ రెడ్డి ని కాదని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అధికారికి క్లియర్ చేసే ధైర్యం లేదన్నారు.
పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను జగన్మోహన్ రెడ్డి కలవరని, రాష్ట్రంలో పరిశ్రమలను గొంతు నులిమి చంపేశారన్నారు. రాష్ట్రానికి రావలసిన వందలాది పరిశ్రమలను, వాటి ద్వారా లక్షలాదిమందికి లభించే ఉద్యోగ ఉపాధి అవకాశాలను యువతకు దూరం చేశారన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలోని యువత తీవ్ర నిరాశ నిస్సృహలో ఉన్నారని, వారు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే అవకాశమే లేదన్నారు.
మద్యం మహమ్మారి కారణంగా మహిళలు ఓటు వేసే అవకాశం లేదన్న ఆయన, గత ప్రభుత్వాలు ఇచ్చిన సంక్షేమ పథకాలకు, ఇంకా ఏదో చేస్తానని భ్రమలు కలిగించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలకు ఆ భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. మహిళలకు ఆ భ్రమలు తొలగిపోతే, వైకాపా అడ్రస్ గల్లంతవుతుందన్నారు. సమాజంలోని ఏ వర్గం ప్రజలను తీసుకున్న వారంతా జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు.
ఉద్యోగులకే కాకుండా, పోలీసులకు కూడా బకాయిలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను రాచిరంపాన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎలా నెగ్గుతానని అనుకుంటున్నారో తెలియదన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లిన తరువాత గత రెండు రోజుల క్రితం నిర్వహించిన ఫ్లాష్ సర్వే లో జగన్మోహన్ రెడ్డి దారుణమైన పరాజయాన్ని ఎదుర్కోబోతున్నారన్నారు.