మన ఊరు – మన బడికి సంబంధించిన పనుల్లో ఏమాత్రం నిర్లక్యం వహించకుండా వెంటనే పనులను పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం ములుగు మండలంలోని మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ఆవరణలో జరుగుతున్న పనుల నాణ్యతను పరిశీలించారు.
పాఠశాలలో జరుగుతున్న పనులను వేగవంతం చేసి 10 రోజుల్లో పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తప్పనిసరిగా ములుగు వెలుగు అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేయాలని సూచించారు. పాఠశాలకు విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలని, 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా బోధన ఉండాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఫలితాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్గి ఉండాలని అన్నారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు అందరు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.