భారత రైతాంగం తలపెట్టిన భారత్ బంద్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నరైతు వ్యతిరేక వ్యవసాయ, విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా బాన్సువాడ నియోజకవర్గం బంద్ లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల డీసీసీబీ ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ పట్టణంలో వర్ని, రుద్రుర్ మండల కేంద్రాలలో రైతులు నిర్వహించిన భారత్ బంద్ లో భాగంగా రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి రాస్తా-రోకో, వంటావార్పు నిర్వహించారు. కొయ్యగుట్ట వద్ద ఉన్న అమరవీరులు స్థూపనికి, బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే భారత దేశ రైతులు మొత్తం మోడీ ప్రవర్తనతో భారత్ బంద్ లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కెసిఆర్ రైతులకు తెలంగాణలో పెద్ద పీట వేస్తూ, తెలంగాణలో రైతు బాంధవునిగా వ్యవహరిస్తే, కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేక బిల్లులను ప్రవేశపెట్టి రాష్ట్ర, దేశ రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నారని విమర్శించారు.
మోడీ తెస్తున్నరైతు వ్యతిరేక చట్టాలతో నేడు అన్నం పెట్టే రైతుల మీద ఆధారపడ్డ వారి కుటుంబాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల చేతుల్లో కీలుబొమ్మగా మారిందన్నారు. ప్రతీ పంటకు గిట్టుబాటు ధర మన రాష్ర్టంలో ఇస్తున్నామన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా రైతు పండించిన ప్రతీ పంటను మద్దతు ధర ఇచ్చి రాష్ర్ట ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.
బీజేపీ పరిపాలిస్తున్న12 రాష్ట్రాలలో ఎక్కడ కూడా రైతు పండించిన పంటను పూర్తిగా కొనడంలేదని ఆరోపించారు. మనం పండించిన పంటను మన ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నా, బీజేపీ మోకాలడ్డుతోందన్నారు. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే రైతన్నలను ఒక్కటే కోరుతున్నానని ఈ ఉద్యమం ఆపకుండా ఇలానే కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి రైతుల కాళ్ళపై పడేవరకూ వ్యతిరేక బిల్లును రద్దు చేసేదాక కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతులు, కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజి రెడ్డి, బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్మన్, నియోజకవర్గంలోని ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, రైతు బంధు అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, సింగిల్ విండో చైర్మన్ లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.