గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపనకు కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్పేట, పెబ్బేర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. గోపాలపేట మండలం బుద్ధారం నుండి ధర్మ తండా వరకు రూ. 68 లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే కేశంపేట, తలుపునూరు తాండ రోడ్డుకు పాత తండా దగ్గర రూ.2.9 కోట్లతో సి.సి. రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన గావించారు. అలాగే బెడ్ షీట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల (రూ. ఒక కోటి 42 లక్షలు 16 వేల 472) ను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు.
గోపాల్ పేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో న్యూమో కొకల్ కాంజు గేట్ వాక్సిన్ (పివిసి) ను చిన్న పిల్లలకు మంత్రి వ్యాక్సిన్ వేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ వేణు గోపాల్, డి ఎం హెచ్ ఓ చందు నాయక్, ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి తదితరులు మంత్రి వెంట ఉన్నారు. అనంతరం వారితో మంత్రి, జిల్లా కలెక్టర్ సహపంక్తి భోజనం నిర్వహించారు.
అనంతరం నాగవరం గ్రామపంచాయతీలో రూ.80 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జడ్పీ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, ఎంపీపీ, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈ.ఈ. మల్లయ్య, వనపర్తి తహశీల్దార్ రాజేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్