గ్రామ పంచాయతీ వర్కర్స్ మరియు మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈనెల ఆరు నుంచి గ్రామ పంచాయతీ వర్కర్లు తమను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాన్ని అమలు చేయాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవడం అత్యంత బాధాకరమన్నారు.
మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రభుత్వం కోట్లాది రూపాయల బకాయి పడిందని ఆ బకాయిలను తక్షణమే విడుదల చేసేవిధంగా చర్యలు తీసుకుని మధ్యాహ్న భోజన వర్కర్ల ఆందోళనను విరమింపజేయాలని ప్రసాద్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సమ్మెకు ప్రత్యామ్నాయం చూడడమో, సమ్మెను అణిచివేయడమో కాకుండా సానుకూల పరిష్కారాన్ని చూపాలని ఆయన కోరారు. కార్మిక వర్గ ఆందోళనకు సిపిఐ పూర్తి మద్దతును తెలియజేస్తుందని ప్రసాద్ తెలిపారు.