త్రాగునీటి ఎద్దడి లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో త్రాగునీరు, సాగునీటి పరిస్థితులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుతుపవనాల ఆలస్యం, వర్షాలు సాధారణం కంటే తక్కువ కురవడంతో జిల్లాలో త్రాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
జూన్ నెలలో సాధారణ వర్షపాతం 105 మిమి. లకు గాను గత సంవత్సరం 110 మిమి. కురిస్తే, ఈ సంవత్సరం 50 మిమి. మాత్రమే కురిసిందని, జూలై లో కూడా ఈ రోజుకు 80 మిమి. లకు 40 మిమి. కురిసిందని ఆయన తెలిపారు. సింగరేణి, మధిర మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, మిగతా మండలాల్లో సాధారణానికి 50 శాతం లోపే నమోదైనట్లు ఆయన అన్నారు. వచ్చే 4 రోజుల్లో వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 2.5 మిమి.
వర్ష సూచన లున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో ఉన్న రిజర్వాయర్లలలో నీటి నిల్వల మేరకు త్రాగునీటికి మొదటి ప్రాధాన్యత నిస్తూ, సాగునీటికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటెక్ వెల్ లలో పూడిక తీసి, నీటి సామర్థ్యం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ నెలాఖరు వరకు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.
మండలం, పంటల వారిగా కార్యాచరణ చేయాలన్నారు. రైతులకు అవగాహన కల్పించి, ముందస్తుగా గైడ్ చేయాలన్నారు. జిల్లాలో ఎన్ని ఎకరాల్లో నారుమడులు ఉన్నవి, ఇప్పటికే ఎన్ని ఎకరాల్లో ఏ ఏ పంటలు సాగు చేపట్టింది అడిగి తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
నర్సరీలు ఎండిపోతే, రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఉద్యానవన పంటలు ఎంతమేర సాగునీటి వనరులు ఉన్నవి, ఎంత మేర ఎన్ఎస్పి పై ఆధారపడుతున్నది వివరాలు సమర్పించాలన్నారు. గతంలో వర్షాభావ పరిస్థితుల్లో ఎటువంటి కార్యాచరణ చేసింది, ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని గత అనుభవాల దృష్ట్యా సమస్యలను అధిగమించడానికి కార్యాచరణ చేసి అమలు చేయాలన్నారు.