తనపై బాలరాజు గౌడ్ చేసిన ఆరోపణలు అసత్యమని సర్పంచ్ రవితేజగౌడ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని గర్గుల్ గ్రామ పంచాయతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. బాలరాజు గౌడ్ తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు. తన పరువుకు భంగం కలిగించారన్నారు. ఆ భూమి గ్రామ పంచాయతీకి చెందిందని తెలిపారు. 2015 లో ఆ భూమి గ్రామ పంచాయతీకి వెంచర్ ద్వారా వచ్చిందన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని తెలిపారు. అప్పుడు తాను సర్పంచ్ గా లేనని తెలిపారు. నాటి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఆ భూమితో తమకు సంబంధం లేదని, ఆ భూమి జోలికి రామని ప్రస్తుత బాధిత కుటుంబం రాసిచ్చారని తెలిపారు. ధరణిలో పొరపాటు వల్ల ఆ భూమికి పాస్ బుక్ వచ్చిందని, దానిని పట్టుకుని తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. పంచాయతీ భూమి కబ్జాకు గురికాకుండా భవిష్యత్ లో ఉపయోగపడేలా ఆ భూమిలో హరితహారం మొక్కలు నాటామన్నారు. 2019 లో ఆ భూమిలో దున్నడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని, ఆ భూమి పంచాయతీకి చెందిందని, భూమి ఇవ్వడం కుదరదని ఆరోజే చెప్పామన్నారు. అయినా ఆభూమి తమ పేరుపై చేయించాలని తనను అడిగారని, కుదరదని చెప్పడంతో తనను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు తన పరువుకు భంగం కలిగించిన వారిపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని, పరువునష్టం దావా వేస్తానని చెప్పారు.
previous post