కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకువచ్చి పార్లమెంట్ ప్రాంత అభివృద్దికి కృషిచేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు అబ్ధుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రామోజీరావు ఫౌండేషన్ వారు ముందుకు రావడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ప్రధాన మంత్రిని, కేంద్రమంత్రుల దృష్టికి తీసుకువచ్చి మెట్రో రైలును రామోజీ ఫిల్మ్ సిటీ వరకు పొడిగించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వందల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకున్నామని వివరించారు.
అందోల్ మైసమ్మ నుంచి ఎల్బీ నగర్ వరకు నేషనల్ హైవే విస్తరణ కొరకు పలు సార్లు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళితే రూ. 600 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గౌరెళ్లి నుంచి ఛత్తీస్గడ్ సరిహద్దుల వరకు జాతీయ రహదారిని మంజూరు చేయించినట్లు వివరించారు.
హామీలు ఇచ్చి శంఖుస్థాపనలు చేసి పనులు చేయడం మర్చిపోయారని రాష్ట్ర సర్కార్ను నిలదీశారు. ఎక్కడ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రభుత్వ కార్యక్రమాలకు తనను పిలవడం లేదని మండిపడ్డారు. ప్రోటోకాల్ను ఉల్లంఘించిన సర్కార్, అధికారులపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.