రాష్ట్ర రాజధాని అమరావతిని సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎన్ని కుట్రలు చేయాలో, అన్ని కుట్రలను చేస్తోంది. పేదలను అడ్డం పెట్టుకొని వికృత మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలను చేస్తున్నారు. పచ్చి అబద్దాలను చెబుతూ, ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పటికే అతనికి ఒక అవకాశం ఇచ్చి ఒక తప్పు చేశాం. సరిదిద్దుకోవడానికి మరొక అవకాశం ఉంది.
ప్రజలంతా తాము చేసిన తప్పును సరి దిద్దు కోవాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు కోరారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, స్టే లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వాదనలు ముగిసిన తరువాత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రఘురామకృష్ణం రాజు స్పందిస్తూ… ఇది పూర్తిస్థాయి స్టే కాకపోయినప్పటికీ, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఒక విధంగా స్టే లాంటిదేనని అభిప్రాయపడ్డారు. రైతులు ఆశించిన తీర్పు కాకపోయినాప్పటికీ, వారికి ఆశాభంగం జరగలేదన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు, సుప్రీం కోర్టు సవరణలు చేస్తూ, రాజధాని ప్రాంతంలో ఇచ్చే ఇళ్ల స్థలాల పట్టాల పై లబ్ధిదారులకు థర్డ్ పార్టీ హక్కు కల్పించరాదని స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టును రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు తప్పుదారి పట్టించారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి, సీనియర్ న్యాయవాదులు కోర్టును తప్పుదారి పట్టించిన తీరు చూస్తే అసహ్యం వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ మన్వి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజధాని ప్రాంతంలో ఐదు శాతం భూములు కేటాయించాలని నిర్ణయించినప్పటికీ, కేవలం తమ ప్రభుత్వం మూడున్నర శాతం భూములను మాత్రమే కేటాయిస్తోందంటూ, రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన జోన్ల గురించి ప్రస్తావించకుండా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.
రాజధాని తరపు రైతుల తరఫున శ్యామ్ దివాన్ అద్భుతమైన వాదనలను వినిపించారు. అమరావతి మాస్టర్ ప్లాన్, నవ నగరాల నిర్మాణం. నవ నగరాల నిర్మాణంలో భాగంగా ఎలక్ట్రానిక్ సిటీ నిర్మిస్తే, స్థానికంగానే మూడు లక్షల ఉద్యోగాలు భూములు ఇచ్చిన రైతు బిడ్డలకు వస్తాయని, ఇక్కడే రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుందన్న కాన్సెప్ట్ ను చూసి రైతులు ముందుకు వచ్చి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని చెప్పారు. ఎలక్ట్రానిక్ సిటీని మింగేసి ఆ ప్రాంతంలోనే నివాసాలన్నీ వచ్చేలా చూడడం వాస్తవ మాస్టర్ ప్లాన్ కు విరుద్ధం. ఏ సిటీకి ఆ సిటీలో ఐదు శాతం భూములను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించాలని నిర్ణయించారని శ్యామ్ దివాన్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
అయితే ఇళ్ల స్థలాల పంపిణీ కోసం మే 7వ తేదీని లేఅవుట్ పూర్తయిందని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను న్యాయస్థానం వింటుందా?, రైతులు చెబుతున్న వాస్తవాలను గమనిస్తుందా? అన్నది చూడాలి. జులై 11వ తేదీన కొత్త బెంచ్ వాదనలు వినే వరకు స్టే లభిస్తుందని రఘురామకృష్ణం రాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనితో జగన్ అండ్ కంపెనీ ఆటలకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుందని ఆయన అన్నారు.