తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి ముఖ్య కారణమైన వేంకటరమణ దీక్షితులుకు ఇప్పుడు తత్వం బోధపడినట్లు కనిపిస్తున్నది. అనునిత్యం తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో ఉండే వేంకట రమణ దీక్షితులు చెప్పే మాటలను అప్పటిలో భక్తులు విశ్వసించేవారు. ఈ అవకాశాన్ని వాడుకున్న వేంకట రమణి దీక్షితులు అప్పటిలో చంద్రబాబునాయుడిపై విషం చిమ్మారు. పింక్ డైమండ్ వ్యవహారంలో చంద్రబాబునాయుడిపై అనుమానం వచ్చేలా పూర్తి స్థాయిలో ఆయన ప్రచారం నిర్వహించారు. నిజంగానే చంద్రబాబునాయుడు తిరుమలలో పింక్ డైమండ్ ను ఇంటికి తీసుకువెళ్లారనే విధంగా ఆయన చేసిన ప్రచారాన్ని ఎన్నికల ముందు వైసీపీ పూర్తిగా ప్రోత్సహించింది.
వేంకట రమణ దీక్షితులు చెప్పిన మాటలు అప్పటిలో ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కొందరు క్రైస్తవ పాస్టర్లను పక్కన పెట్టుకుని నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సు పలు వివాదాలకు దారితీసింది కూడా. అయినా వెనక్కు తగ్గని వేంకట రమణ దీక్షితులు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తూనే వచ్చారు. ప్రతి ఒక్కరూ నమ్మే విధంగా వేంకట రమణ దీక్షితులు ఎన్నో అబద్ధాలను ప్రచారంలోకి తీసుకువచ్చారు. అప్పటిలో జగన్ ప్రోత్సాహం చూసిన వేంకట రమణ దీక్షితులు మరింత రెచ్చిపోయి చంద్రబాబునాయుడిపై అసత్యాలను మరింత ఎక్కువగా ప్రచారం చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం పోయి జగన్ అధికారంలోకి వస్తే తనను తిరుమల ప్రధాన అర్చకుడిగా నియమిస్తారని వేంకట రమణ దీక్షితులు బలంగా నమ్మారు. ఇదే కోరికను ఆయన జగన్ ముందు ఉంచారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రధాన అర్చకుడిగా వేంకట రమణ దీక్షితులు అడిగినా నియమించలేదు. పలుదఫాలుగా ఆయన జగన్ ను కలిసి తన కోరికను వెల్లడించగా ఎలాంటి ప్రాధాన్యతా లేని పోస్టును వేంకట రమణ దీక్షితులకు కట్టబెట్టారు. పదవి దక్కినా వేంకట రమణ దీక్షితులుకు అసంతృప్తి పోలేదు.
తాను ప్రధాన అర్చకుడి పోస్టు అడిగితే తనకు ఆగమ శాస్త్ర సలహాదారుడి పోస్టు ఇవ్వడంపై వేంకట రమణ దీక్షితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాతి కాలంలో ఆయన కుమారులకు అర్చక పోస్టులు వచ్చినా వారిని ఎక్కువ కాలం తిరుమలలో కొనసాగ నివ్వలేదు. దాంతో వేంకట రమణ దీక్షితులకు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేక ఏర్పడింది.
వేంకట రమణ దీక్షితులు జగన్ ను కలిసి తనకు ఏ పోస్టు కావాలో అడుక్కున్నా అది ఆయనకు దక్కలేదు. పైగా ఆయన కుమారులకు కష్టపడి ఇప్పించుకున్న పోస్టులు కూడా గాలిలో దీపం అయ్యాయి. జగన్ ప్రభుత్వం లో ఏ మాత్రం ఆదరణ దొరకని వేంకట రమణ దీక్షితులు గత కొద్ది కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తాజాగా వేంకట రమణ దీక్షితులు ఆంధ్రాలో ఆలయాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేంకట రమణ దీక్షితులు మాటకు గతంలో ఎంతో విలువ ఉండేది. చంద్రబాబునాయుడి పట్ల విషం చిమ్మడం, ఆ తర్వాత ఆ విషయాలలో నిజం లేదని తేలడంతో ఆయన మాటకు విలువ లేకుండా పోయింది.
ఇప్పుడు ఆయన జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన ఇటీవలి కాలంలో మరో పెద్ద వ్యాఖ్య కూడా చేశారు. తిరుమల హుండీలో డబ్బులు వేయవద్దని, అవి దుర్వినియోగం అవుతున్నాయని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇదే తరహా స్టేట్ మెంట్ ను చంద్రబాబు హయాంలో కూడా ఇచ్చారు. ఇలా వేంకటేశ్వరుడిని రాజకీయాలకు వాడుకుంటున్న వేంకట రమణ దీక్షితులు భక్తుల సానుభూతిని కోల్పోయారు. ఇప్పుడు ఆయన వాస్తవాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా వేంకట రమణ దీక్షితులు చిత్తశుద్ధితో ఆ వేంకటేశ్వరుడిని జపిస్తూ ఇంట్లో కూర్చోవడం ఉత్తమం.