కోవిడ్ 19 విధి నిర్వహణలో కాలు విరిగిన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శ్రీనివాసపురం గ్రామానికి చెందిన చెడపంగు రాణిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హర్షవర్ధన్, తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ పరామర్శించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కరోనా పై పోరాడుతున్న కాంట్రాక్టు వైద్య సిబ్బందికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, విధినిర్వహణలో చనిపోయిన వైద్య ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే 50 లక్షలుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలను మొత్తం కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.
వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి, శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇందిరాల రామకృష్ణ, భాస్కర్ రాజు, డివిజన్ అధ్యక్షుడు బందెల రాములు, నిమ్మల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.