బోనమెత్తి అమ్మవారిని వేడుకున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు
సీఎం కేసీఆర్ కలలోకి వెళ్లి ఆయన మనసు మార్చాలని సీఎం కేసీఆర్ ను సమగ్ర శిక్ష ఉద్యోగులు వేడుకున్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షలు 12 వ రోజు కొనసాగాయి. శుక్రవారం అమ్మవారికి బోనాలు తీసి మొక్కులు చెల్లించుకుని నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్తబస్టాండ్ వద్ద గలా బంగారు మైసమ్మ ఆలయం వరకు పురుషులు పోతరాజు వేషధారణలు వేసి మహిళ ఉద్యోగులు బోనాలు ఎత్తుకుని ఊరేగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాల నుంచి విద్యశాఖలో కీలకంగా పని చేస్తూ ఇప్పటికి కూడా కనీస వేతనం లేకుండా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల పండుగలో ఉద్యోగులందరూ పాల్గొని తమను రెగ్యులర్ చేయాలని మైసమ్మ దేవతకు విన్నవించుకున్నారు. మైసమ్మ తల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ కలలోకి వెళ్లి తమ సాధక బాధలు తెలియచేసి వెంటనే తమను రెగ్యులర్ చేయాలని అమ్మవారికి మొక్కులు మొక్కారు. తమ కోరిక నెరవెరితే మేకపోతులతో ఘనంగా బోనాలు తీసి మొక్కు చెల్లిస్తామని దేవతకు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు దామోదర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు భాను, వీణ, శైలజ, సంపత్, రాములు, సంతోష్ రెడ్డి, సంధ్య, మాధవి, కాళిదాస్, శివ ఈశ్వర్ , గంగాధర్ ఉద్యోగులు పాల్గొన్నారు