అవినీతికి పాల్పడుతున్న రాజకీయ నేతలు చరిత్రలో నిలబడలేరని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో భాగంగా ఈనెల 24వ తేదీన విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఆది కవి నన్నయ వేదికపై మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర పై జరిగిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జాతీయ నేత పి మధు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు వి.వి.
లక్ష్మీనారాయణ, ఏ.బీ. వెంకటేశ్వర్లు, మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ నేడు సమాజంలో ఉన్న అవినీతి, విద్వేష భావజాలం, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా కవులు, రచయితలు ఉద్యమించాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలన్నారు.
ఆకలి సూచికలోనూ, అసమానత సూచికలోనూ, పేదరికంలో, నిరక్షరాస్యతలో, నిరుద్యోగంలోనూ ఇండియా అగ్ర భాగంగా ఉండడం విచారకరమన్నారు. రాజా రామ్మోహన్ రాయ్, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం,ఈశ్వర్ చంద్ విద్యాసాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్, నారాయణ గురు, అంబేద్కర్, రఘుపతి వెంకటరత్నం నాయుడు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మహాత్మా గాంధీ,దయానంద సరస్వతి, వివేకానంద స్వామి లాంటి సంఘసంస్కర్తలు రచయితలుగా సమాజ హితం కోరే భావజాలాన్ని భారతదేశానికి అందించినారన్నారు. కొన్ని శతాబ్దాలు గడిచినా ఇలాంటి మహనీయులను సమాజం గుర్తించుకుంటుందన్నారు.