టీఆరెస్ అంటే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నాడు నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కోవిడ్ సంక్షోభంలో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, వారికున్న అపార అనుభవం వల్లే రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకం బ్రహ్మాండంగా విజయం సాధించాయని అన్నారు.
గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ రోగులను నేరుగా కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి జరిగిందని తెలిపారు. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద పడకల ఆసుపత్రి మంజూరు అయ్యిందని ఈ సందర్భంగా తెలియజేసారు.
నకిరేకల్ లో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. ఆసుపత్రి మంజూరుకు చొరవ తీసుకున్న మున్సిపల్ శాఖమాత్యులు కేటీఆర్ కి, తమ నియోజకవర్గ ప్రజలందరి పెద్దదిక్కు రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు జగదీష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
అయిటిపాముల లిఫ్ట్ ద్వారా త్వరలోనే రైతాంగానికి సాగునీరు అందిస్తామని, నకిరేకల్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, డివైడర్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పారిశుద్ధ్య లోపం లేకుండా నకిరేకల్ అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని అన్నారు.
పట్టణ అభివృద్ధి ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన దైర్యంగా ఉండాలని, ఏ సమస్య వచ్చిన తనను నేరుగా సంప్రదించండని సూచించారు.