దేశ స్వాతంత్ర్య సంగ్రామం లో అ శువులు బాసిన త్యాగధనుల ఆశయ సిద్ధికి నేటి తరం కృషి చేయాలని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు. అజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా నగరంలో ని ఫోర్ట్ సిటీ స్కూల్ ఆధ్వర్యంలో కోట వద్ద నుంచి నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే కోలగట్ల ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి కబంధహస్తాల నుంచి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించేందుకు ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని అన్నారు. వారి త్యాగ ఫలితమే నేడు స్వాతంత్ర్యం అని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వాడ వాడలా సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఫోర్ట్ సిటీ స్కూల్ చైర్మన్ కేఏపీ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుని భరతమాతకు జై అంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలు చేశారు. కోట వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మూడు లాంతర్లు, గంటస్తంభం మీదుగా బాలాజీ జంక్షన్ వరకు సాగింది. దేశ త్యాగధనుల ను గుర్తుచేస్తూ విద్యార్థిని విద్యార్థుల వేషధారణలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి పాఠశాల బాల బాలికలను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు అశోక్ వర్మ, మధు,వైస్ చైర్మన్ చంటి రాజు, స్కూల్ ప్రిన్సిపాల్ గిరిజారాణి, అకాడమిక్ అడ్వైజర్ రోహన్ ఖాన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.