ఉత్తరాఖండ్ లోని వాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ లో ఒక్క సారిగా మేఘాల విస్ఫోటనం జరగడంతో ఏర్పడిన పెను ప్రమాదం నుంచి 163 మంది యాత్రీకులు సురక్షితంగా బయట పడ్డారు. ఛమేలీ జిల్లాలో ఉన్న వాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ సిక్కుల పవిత్ర పుణ్య క్షేత్రమైన హిమకుండ్ సాహిబ్ కు దగ్గరలో ఉంటుంది. అత్యంత అరుదైన పుష్పాలు లభించే ఈ ‘పూల లోయ’ ఆరు నెలలు మంచుతో కప్పేసి ఉంటుంది.
ఇప్పుడు మంచు విడిపోవడంతో పర్వతారోహణ చేసే వారు ఈ ప్రాంతానికి వెళుతుంటారు. ఒక్క సారిగా మేఘాల విస్ఫోటనం జరగడంతో బుధవారం సాయంత్రం అక్కడ భారీ వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం నుంచే అక్కడ ఉన్న పూల వాగు ఉధృతంగా ప్రవహించింది.
ఈ క్రమంలో లోయ గేటు దగ్గర గదెరపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ఎస్డిఆర్ఎఫ్, అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయను సందర్శించేందుకు వెళ్లిన 163 మంది పర్యాటకులను సురక్షితంగా తరలించినట్లు వ్యాలీ రేంజర్ చేతనా కంద్పాల్ తెలిపారు.
సంఘటన జరగడానికి ముందే వందలాది మంది పర్యాటకులు లోయ నుండి తిరిగి వచ్చారు. మరోవైపు, ఘంగారియా సమీపంలోని పటోడి టోక్ వద్ద మేఘాల విస్ఫోటనం కారణంగా, కొండ నుండి భారీ మొత్తంలో శిధిలాలు మరియు నీరు పుష్పవతి నదిలోకి వచ్చాయి.
దీంతో హిమకుండ్ వెళ్లే యాత్రికుల్లో కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో గద్దెర నీరు తగ్గినప్పుడే మళ్లీ తాత్కాలిక వంతెన నిర్మిస్తారు. వాతావరణం, రహదారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లోయలో పర్యాటకులకు అనుమతి ఇచ్చేది లేనిది గురువారం నిర్ణయం తీసుకోనున్నారు.