మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగులోని శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలతో పాటు భక్తులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరికొండ బలరాం తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మహా శివరాత్రి జాగరణ ఉత్సవ వేడుకల కరపత్రాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
శనివారం నగరేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కమిటీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా శివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివపార్వతుల కళ్యాణం, అభిషేకాలు, ఆర్కెస్ట్రా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, శివాలయం భజన కమిటీ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, స్థానిక పాఠశాల విద్యార్థులచే నృత్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మార్చి 1వ తేదీన ఉదయం 5గంటల నుంచి సాయంత్రం అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 7గంటలకు శివపార్వతుల కళ్యాణం ఉంటుందన్నారు. అదేవిధంగా జాగరణ చేసే భక్తుల కోసం రాత్రి 10గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు భజన, ఆర్కెస్ట్రా, సాంస్క`తిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పత్తిపాకకు చెందిన శ్రీ రామాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, హన్మకొండ హంపి నాట్య కళామండలి నిర్వాహకురాలు పెండ్యాల జయశ్రీ శిష్య బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శివుని కృపకు పాత్రులు కావాలని బలరాం పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు గాదం కుమార్, గొల్లపల్లి రాజేందర్, కొత్తపల్లి బాబురావు, మావురపు అనిల్ రెడ్డి, అర్చకులు వెంకటేశ్వర శాస్త్రి పరికరాల రవి, ఎస్.విశ్వనాథ్, యాసం రాజ్ కుమార్, మాదం సాగర్, ఆముదాలపల్లి భిక్షుగౌడ్, దేవేందర్, గుగ్గిళ్ళ సృజన్ తదితరులు పాల్గొన్నారు.