మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి సమావేశ మందిరంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మన ఊరు-మన బడి కార్యక్రమ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద జిల్లాలో 426 పాఠశాలలను మొదటి విడత లో ఎంపిక చేసి, మరమ్మత్తులు, అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 15 శాతం పాఠశాలల పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని, ప్రారంభించుకున్నట్లు ఆయన అన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని, పనులు దగ్గరుండి పూర్తి చేయించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. పనులు పూర్తయిన వరకు ఎంబి రికార్డులు నమోదు చేసి, ఎఫ్టివోలు జనరేట్ చేయాలన్నారు. పనుల పూర్తిలో 29 శాతమే నమోదులు చేసినట్లు ఆయన తెలిపారు. రికార్డు నమోదు చేయకపోవడం, ఎఫ్టివోలు జనరేట్ చేయక పోవడంతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నట్లు ఆయన అన్నారు. మంజూరు అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. పనులు ఈ విద్యా సంవత్సరం లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ వివి. అప్పారావు, జిల్లా విద్యాధికారి ఇ. సోమశేఖరశర్మ, డిఆర్డీఓ విద్యాచందన, వివిధ ఇంజనీరింగ్ శాఖల ఇఇలు, డిఇలు, ఏఇలు, మండల విద్యాధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post