పేద ప్రజలకు పంపిణీ చేయవలసిన రేషన్ బియ్యాన్ని “బడాదోస్తు” వాహనాల ద్వారా తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సు మెంట్ పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్ లోనికి అక్రమంగా తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్సు డైరెక్టర్ జనరల్ స్పెషల్ టీం, గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు, స్థానిక పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి దాడి నిర్వహించారు.
బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామం లో లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్ కు కొద్ది దూరంలో నిఘా వేసి వుండగా, ఒక వాహనం లోడుతో రైస్ మిల్లు లోనికి వెళుతుంగా, సదరు వాహనమును వెంబడించి మిల్లు లోనికి వెళ్ళి బస్తాలు దింపే సమయంలో పట్టుకున్నారు. AP27TX 0764 వాహనంలో 55 బస్తాల PDS బియ్యం గుర్తించారు. మిల్లు ఆవరణలో మరొక వాహనం AP39TS 4141 కూడా వున్నది. మిల్లులో తనిఖీ చేయగా అక్కడ కూడా PDS బియ్యం మూడు కుప్పలుగా పోసి వున్నాయి.
వాటిని బస్తాలలోనికి ఎత్తించగా 131 బస్తాలు అయ్యాయి. వాటితోపాటు వాహనంలో ఉన్న 55 బస్తాలను మొత్తం (131+55) 186 బస్తాలను కాటా వేయించగా 110 క్వింటాళ్ళ PDS బియ్యం వున్నాయి. బడాదోస్తు వాహనం డ్రైవర్ ను విచారించగా ఇంకొల్లు మండలం, హనుమాజీపాలెం మరియు కారంచేడు మండలం జరుగులవారిపాలెం గ్రామాలలో బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి రేషను కార్డు దారుల నుండి సేకరించిన PDS బియ్యం 55 బస్తాలను తమ వాహనంలో లోడు చేయగా, స్వర్ణ రైస్ మిల్ యజమాని, మేనేజర్ ఉత్తర్వుల ప్రకారం రైస్ మిల్ లో దించేందుకు వచ్చినట్లు చెప్పాడు.
110 క్వింటాళ్ళ PDS బియ్యం, 2 వాహనాలు స్వాధీన పరచుకొని నిత్యావసర సరుకుల చట్టం క్రింద 6-A కేసుతో పాటు మిల్లు యజమాని,మేనేజర్, పై తెలిపిన వాహనాల యజమానులు డ్రైవర్ లపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయ వలసినదిగా స్థానిక సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దారు వారిని కోరారు.ఈ తనిఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎ.శ్రీహరి రావు, తహసిల్దార్ కె. నాగమల్లేశ్వర రావు, స్థానిక డిప్యూటీ తహసీల్దారు, సిబ్బంది పాల్గొన్నారు.