జగనన్నను నమ్ముకుంటే ఏ లోటూ ఉండదని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనుకుంటుంటారు. అయితే పదవి సంగతి పక్కన పెట్టి కనీసం పాస్ కూడా ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తారని ఈ సంఘటన గుర్తు చేస్తున్నది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ నన్నపనేని సుధ కథ ఇది.
జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా సోమవారం వినుకొండ కు సీఎం జగన్మోహన్రెడ్డివచ్చారు. పట్టణంలోని వెల్లటూరు రోడులోని బొల్లా బ్రహ్మనాయుడు ఎస్టేట్ వద్ద సభావేదిక ఏర్పాటు చేశారు. జూనియర్ కాలేజీ ఆవరణలోని హెలీప్యాడ్ నుంచి సభావేదిక వద్దకు ఉదయం 11.20గంటలకు జగన్ మోహన్రెడ్డి చేరుకొని 12.09గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించి 12.43 నిమిషాలకు ముగించారు.
సభాప్రాంగణంలో లోపలకు వెళ్లేందుకు గేట్లను ఏర్పాటు చేసి బయటకు రాకుండా పోలీసులు గేట్ల వద్దే ఉన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు డాక్టర్ సుధ పాస్ పొందాలనుకున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఎంతో ఖర్చు చేసి కూడా గెలవలేకపోయిన సానుభూతి ఉంటుందని డాక్టర్ సుధ భావించారు. అదే మనసులో పెట్టుకుని ప్రోటోకాల్ పాస్ కోసం ముఖ్యమంత్రి కార్యక్రమాల ఇన్ చార్జి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ను అడిగారు.
ఆయన ఫోన్ ఎత్తలేదు. పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడిగారు. కుదరలేదు. ఆయన ఇప్పించలేదు. నరసరావుపేట ఎంపి కృష్ణదేవరాయలును అడిగారు. ఎస్ పిని అడగండి ఇస్తారని ఆయన చెప్పారు. అయితే ఎస్ పి ఆమె ఫోన్ ఎత్తలేదు. జిల్లా కలెక్టర్ ను అడిగారు. అయితే స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెబితేనే పాస్ ఇస్తానని కలెక్టర్ కరాఖండిగా చెప్పేశారు.
ఇలా ఎవరూ కూడా డాక్టర్ సుధ ను ఆదుకోలేదు. డాక్టర్ సుధ తల్లి నన్నపనేని రాజకుమారి తెలుగుదేశం పార్టీ నాయకురాలు. తల్లిని కూడా కాదని బయటకు వచ్చి డాక్టర్ సుధ వైసీపీలో చేరారు. డాక్టర్ సుధకు వైసీపీ టిక్కెట్ లభించిన తర్వాత కూడా చాలా మంది తల్లిని కాదని వైసీపీలో చేరుతున్నావు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అయినా నాకు జగనన్న ఉన్నాడు అని చెప్పిన డాక్టర్ సుధ పోటీ చేశారు.
కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఉన్న ఆస్తి అంతా అయిపోయింది. ఇంతలో తనకు తన భర్తకు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చాయి. దాంతో పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. ఇప్పుడు అన్నీ సర్దుకుని వైసీపీ లో చురుకుగా పాల్గొనాలని డాక్టర్ సుధ భావించారు. అయితే ఉన్న ఎమ్మెల్యే నుంచి ఏ నాయకుడు కూడా సహాయం చేయలేదు. డాక్టర్ సుధ ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.