మహిళా సంఘాలకు రావాల్సిన నిధులు వచ్చేదాకా వదిలిపెట్టేది లేదని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మరోమారు.. మహిళా పోరు కార్యక్రమంలో భాగంగా రాజంపేట, బిక్కనూర్ మండల కేంద్రాల్లో ఆయా గ్రామాలకు చెందిన మహిళలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలకు శ్రీనిధి, వడ్డీలేని రుణాలు, అభయహస్తం నిధులు సుమారుగా 50 కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు.
మహిళల నుంచి రుణాలు వసూలు చేస్తున్న ప్రభుత్వం వారికి రావాల్సిన వాటిని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. బిక్కనూర్ మండల కేంద్రంలో అధికారులపై రమణారెడ్డి ఫైర్ అయ్యారు. ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్న మహిళలను వెళ్లొద్దంటు ఆపడానికి ప్రయత్నించిన ఏపీఎం, సిసిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎం, సిసిలు, సీఏలు చేతనైతే సంఘాలకు రావాల్సిన నిధులను ఇప్పించే ప్రయత్నం చేయాలని, లేదంటే నోరు మూసుకుని వాళ్లపని వాళ్ళు చేసుకోవాలని హెచ్చరించారు. న్యాయంగా రావాల్సిన రుణాలను సాధించుకునేందుకు ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకుంటే ఊరుకునేది లేదన్నారు.
వాళ్లకు జీతాలు ఇవ్వకపోతే రోడ్లపైకి వెళ్లి ఆందోళనలు చేయలేదా అని ప్రశ్నించారు. ఏపీఎం, సిసిలు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా తనతో పెట్టుకోవద్దన్నారు. మీ జాతకాలు బయటపెట్టే దాకా తెచ్చుకోవద్దన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించి తోక జాడిస్తే తోక కట్టిరిస్తామన్నారు. ఇంకోసారి నోరు జారితే మహిళా సంఘాలకు రావాల్సిన డబ్బులు జమైన మరుక్షణమే వారి ఇంటిముందు కూర్చుంటామని హెచ్చరించారు.