ఎపుడు నిను నేను జపించనిది?
ఎపుడు నీకై
నేను తపించనిది?
తొలి పొద్దు వేళ
ఆశల రంగులద్దుకునే
హృదయాకాశంలో నిన్ను పలవరించానా లేదా?
మలిపొద్దు వేళ
మసకబారిన కాంక్షల కళ్ళతో నీకై పరికించానా లేదా?
ఈప్సితాల కుసుమ మాలికనై
నీ కంఠం చుట్టూ శిశువులా గారాబంగా వేలాడాను
భయమనే ఆచ్ఛాదనాన్ని
గుండె నిండా ధరించి
వాస్తవాల్లో శోకిస్తూ
అవాస్తవాల్లో శోభిస్తూ
తెలియని సందిగ్ధావస్థలో
నీకై వెదుకుతున్నాను
అప్పుడే తీయని తలపుల్ని నా మదిన అద్ది
అంతలోనే ఖేదపు సంగీతాన్ని నాతో పలికిస్తావు
మౌనపు నిశ్శబ్దతలో కలిసి నువ్వు
అమౌనపు అలజడిలో అలసి నేను
ఏ దుఃఖపు తీరాగ్ర రేఖ వద్ద నో మనం కలిసి మాట్లాడుకోవాలి
ఏ పగడపు దీవుల్లోనో మనిద్దరం కలిసి సంతసపు రత్నాల్ని ఏరుకోవాలి
నాలోని భయాల్ని
నీలోని నిశ్చలతలో
మిళితం చేసి
ప్రభూ!
నేనో ఆర్ద్ర గీతం పాడుకోవాలి.
ఈ విశ్వపు సరిహద్దుల్లో
మోహమై నీలో నిండిపోవాలి.
రాజేశ్వరరావు లేదాళ్ళ, లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా