సమిష్టి కృషితోనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని దీని కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలపునిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో ‘పంచాయతీ రాజ్ సమ్మేళనం-పట్టణ ప్రగతి’పై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధుల సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఇందులో భాగంగానే పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టామని చెప్పారు. పల్లెప్రగతిలో గ్రామాల్లో గుర్తించిన సమస్యలను పూర్తి చేసేందుకు ఈ పంచాయతీ రాజ్ ప్రజాప్రతినిధుల సమ్మేళనం ఎంతో దోహదపడనుందన్నారు. పల్లె ప్రగతి లో గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రతినిధులు,అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.
పట్టణ ప్రగతిలో సమస్యలను గుర్తించి, పరిష్కారించాలన్నారు. అభివృద్దిలో అలసత్వం వహిస్తే మీ పదవులకు మీరే బాద్యులవుతారు, పనిచేయని అదికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలుంటాయని ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పారన్నారు. బాధ్యతగా పనిచేసి ప్రజాభిమానాన్ని పొందాలని దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ జనార్ధన్, కలెక్టర్ శ్రీదేవసేన, తదితరులు పాల్గొన్నారు.