వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్ లోని ఎడ్ల బజార్ ను గురువారం తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎడ్లబజార్ లోని ఆవరణలో కలియ తిరిగి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. ముందుగా లోపలికి వచ్చే ఆవుల వాహనాల లోడ్, బయటకు వెళ్లే వాహనాల లోడ్ రిజిస్టర్ లో నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని మార్కెట్ కార్యదర్శి హాబీబ్ కు చైర్మన్ విఠల్ నాయక్ సూచించారు.
ఎడ్లబజార్ లో కావాల్సిన మౌలిక సదుపాయాలైన సిసి రోడ్డు, నీటి వసతి, పశువులకు నీటి బెడ్డు, సిసి కెమెరాలు తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు చైర్మన్ వివరించారు. అదేవిధంగా చెట్లకు నీరు పోసేందుకు, పశువులకు మేత వేసేందుకు వీలుగా ఒక కాపరిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా దళారుల, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూస్తామని చైర్మన్ స్పష్టంచేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో వైస్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, డైరెక్టర్ లు సప్తగిరి గౌడ్, మల్లప్ప, రైతులు , మార్కెట్ అధికారులు ఉన్నారు.