రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొంతగాని సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమధుర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సంగీత సామ్రాట్ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యానికి నివాళులు అర్పించిన అనంతరం కళాకారుల సంఘం నాయకులు మాట్లాడుతూ వందల, వేల చలన చిత్రాలలో వేలకు పైగా మధురమైన పాటలు పాడి సాహితీ ప్రియుల మన్ననలు పొందిన వ్యక్తి ఆయన అన్నారు.
గాన గంధర్వ బిరుదు పొందిన స్వర్గీయ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనేక మంది హృదయాలను తన గానామృతంతో మైమరపింప చేశారని అన్నారు.
ఎంతోమంది గాయకులను, గాయనీమణులను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి,వారిని ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తోడ్పడిన మహానుభావుడని శ్లాఘించారు.
తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళం వంటి ఎన్నో రకాల భాషల్లో తన గానామృతం ద్వారా ప్రజలను మైమరిపింప చేశారని అన్నారు.
ఎంతోమంది కథానాయకుల గొంతుకను తన గొంతు ద్వారా మాటల, పాటల రూపంలో వినిపించిన నేపధ్య గాయకుడు అకస్మాత్తుగా మరణించడం సంగీత కుటుంబానికే తీరనిలోటని అన్నారు.
వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రంగస్థల సీనియర్ కళాకారులు ధర్మూరి వెంకటేశ్వర్లు, సప్పిడి బిక్షం, పిచ్చయ్య, గోవిందు, వీరబాబు, రమేష్, భద్రాచలం, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.