జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందా? లేదా గతంలో మాదిరిగానే తరుగుతుందా? అనే విషయం ఓట్ల నమోదు అనంతరమే తెలియనుంది. గతంలో అత్యంత తక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. ఓ వైపు గ్రామాల్లో ఓటింగ్ శాతం పెద్ద ఎత్తున పెరుగుతుండగా, తెలంగాణకే గాక, దేశానికే మణిమాణిక్యంగా విరాజిల్లుతున్నవిశ్వనగరంగా ప్రసిద్ధి చెందుతున్న హైదరాబాద్లో మాత్రం ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుండడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసీ, పోలీసులు, రాజకీయ నేతలు పార్టీలకతీతంగా, విద్యావేత్తలు తదితరులు ఓటు హక్కు వినియోగించుకోవాలని తద్వారానే సుపరిపాలన సాధ్యమని అవగాహన కల్పించారు. మరి వీరి చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూద్దాం
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 74,24,096 ఓటర్లుండగా ఈ సారి 74,44,260 ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 38,77,688, కాగా మహిళలు 35,65,875, ఇతరులు 676. గతంలో (45.29) శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 33,62,688 మంది మాత్రమే గతంలో ఓట్లు వేశారు. కాగా ఈసారి మాత్రం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. రాజకీయ నేతలు కూడా ఓటింగ్పై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రస్తుత ఎన్నికల్లో 28,683 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా 81,88,686 బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. పోస్టల్ బ్యాలెట్ 2831 సదుపాయం కల్పించగా, 150 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేయడం విశేషం.
కాగా గతంలో పోలైన ఓటింగ్ వివరాలను పరిశీలిస్తే ఆయా పార్టీల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
టీఆర్ఎస్ 14,68,618 (43.85 శాతం), ఎంఐఎం 5,30,812 (15.85 శాతం), టీడీపీ 4,39,047 (13.11 శాతం), కాంగ్రెస్ 3,48,388 (10.40 శాతం), బీజేపీ 3,46,253(10.34 శాతం) ఓట్లను దక్కించుకోగలిగారు.
ఇక ఈసారి మాత్రం జీహెచ్ఎంసీలో పోలింగ్ శాతం పెరిగితే ఆయా పార్టీలకు భంగపాటు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. రసవత్తర పోటీలో భాగంగా హోరాహోరీ ప్రచారాల సందర్భంగా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగానే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రముఖులు వెల్లడించారు.