బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు.. సంక్షమమే లక్ష్యంగా సమసమాజ స్థాపనకు కృషి చేసిన జ్యోతిరావు పూలే గొప్ప సమతావాద దార్శనికుడని ఏపీలోని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అభివర్ణించారు. లింగ వివక్షతను పారద్రోలి, బాలికలకు చదువు అవసరమని నమ్మి నాటి సమాజంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. ఆయన ఆలోచనలు, అనుసరించిన విధానాలు, అవలంభించిన పద్ధతులు నేటి ఆధునిక సమాజానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ 18వ శతాబ్దం నాటి వ్యక్తి కోసం ఇప్పటికీ స్మరించుకుంటున్నామంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవాలని అన్నారు. స్త్రీ విద్యాభ్యాసం, వితంతు వివాహాల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవని ప్రశంసించారు. సమాజానికి మంచి చేయాలనే తపనతో పూలే జీవించారని పేర్కొన్నారు.
ఆయన భార్య సావిత్రాభాయి పూలే సాయంతో అనేక పోరాటాలు చేసి బాలికల చదువుకు పెద్దపీట వేసి, అసమానతలు లేని సమాజ నిర్మాణానికి పాటుపడ్డారన్నారు. పూలే ఆశయాలను నెరవేరుస్తూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నడుచుకుంటున్నారని తాజా మంత్రి వర్గంలో బీసీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
కుల రహిత సమాజ స్థాపనకు కృషి-జిల్లా కలెక్టర్ సూర్యకుమారి.
కుల రహిత సమాజ నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసి కృషి ఎనలేనిదని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. స్త్రీలకు చదువు కల్పించాలనే బలమైన సంకల్పంతో ఇంటి నుంచే ఆ మార్పుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. బీసీలకే కాకుండా అన్ని వర్గాల వారికీ విద్యను అందించారని తెలిపారు.
నేటి సమాజంలో అక్షరాస్యత శాతాన్ని మరింత పెంపొందించేందుకు మనందరం ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చదువు ద్వారానే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని చాటిచెప్పిన ఘనుడు, ముందు చూపు కలిగిన గొప్ప సంఘ సంస్కర్త, మహాత్మా గాంధీ తర్వాత అంతటి మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి కలెక్టర్, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వెనుకబడిన వర్గాలకు అండగాపూలే-ఎమ్మెల్యే కోలగట్ల
సమాజంలో వెనుకబడిన వర్గాలకు జ్యోతిరావు పూలే అండగా నిలిచారని, వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని స్తానిక ఎమ్మెల్యే కోలగట్ల పేర్కొన్నారు. నాటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ప్రజల్లో చైతన్యం కల్పించి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. పూలే సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి నాలాంటి వ్యక్తికి ఈ రోజు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వటం నిజంగా సంతోషదాయమని అన్నారు.
బీసీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా కోలగట్ల పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలకపాటి రఘువర్మ, డీఆర్వో ఎం. గణపతిరావు, ఉత్తరాంధ్ర బీసీ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు, బీసీ వెల్ఫేర్ అధికారిణి డి. కీర్తి, డీపీఎం పద్మావతి, వ్యవసాయ శాఖ జేడీ వి.టి. రామారావు, పశు సంవర్థక శాఖ జేడీ రమణ, మెప్మా పీడీ సుధాకర్, సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ డి. రమేశ్, నెడ్ క్యాప్ ఛైర్మన్ సూర్యనారాయణ రాజు, ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘం నేతలు, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.