విద్యుత్ షాక్తో ఓ 19 నెలల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతం పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన రమ్య, భర్త బండి ప్రవీణ్తో గొడవపడి ఏడాది కాలంగా పుట్టింటి వద్దే ఉంటుంది. కొడుకు శ్రీతిక్ను ఎత్తుకొని(19 నెలల బాలుడు) దండెంపై నుంచి బట్టలు తీస్తుంది.
ఈ క్రమంలో సడన్గా ప్లాస్టిక్ జియా వైరుకు, ఆరు బయట బల్బు కోసం వేసిన బుగ్గల వైరు తగిలి ఉండడంటో విద్యుత్ షాక్ తగిలింది. ఈ విషయాన్ని గమనించి పక్కింటి వ్యక్తి, అక్కడికి చేరుకొని కట్టెతో వైరుపై గట్టిగా కొట్టాడు. దీంతో తల్లీ రమ్య కింద పడిపోయింది.అప్పటికే బాలుడు శ్రీతిక్ నోటి మాట రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.
వెంటనే గ్రామ సర్పంచ్ చిట్టెడి మధుమోహన్ రెడ్డి తన వాహనంలో ఎక్కించుకొని కామారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందాడని ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ మేరకు స్థానిక పోలీసులకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.