అద్దె ఇంట్లో ఉంటున్న వాడిలా అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఉంది. ఒక్క శాఖ కాదు అన్ని శాఖల ఉద్యోగులకూ ఇదే స్థితి. ఇంటి ఓనరు మౌఖికంగా చెప్పినట్లు శాఖాధిపతులు ఉద్యోగులకు చెబుతున్నారు. ఏమని? వచ్చే నెలా 5 కల్లా విశాఖపట్నం వెళ్లిపోవాలి. లేకపోతే ఇదే మీకు ఆఖరి జీతం.
ఈ మాటలు విన్న ఉద్యోగులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. లిఖితపూర్వకంగా ఆర్డర్ ఇస్తున్నారా అంటే అదీ లేదు. అమరావతి నుంచి వెళ్లి పోవాలి. అంతే. విశాఖపట్నం తరలి పోవాలి. అంతే. అక్కడ ఆఫీసు ఎక్కడ ఉన్నది? ఎక్కడ కూర్చోవాలి? తమకు వసతి సదుపాయాలు ఎవరు చూస్తారు?
తాము ఎక్కడ ఉండాలి? అన్నీ ప్రశ్నలే. వీటికి సమాధానం ఉండదు. పై అధికారులు మాత్రం సిబ్బంది కనిపించినప్పుడల్లా వచ్చే నెల 5 వరకే నీకు ఉద్యోగం. 6వ తేదీ నుంచి విశాఖ పట్నం రాకపోతే నీకు ఇదే ఆఖరు జీతం అని చెబుతున్నారు. ఉద్యోగం మానేస్తే మానెయ్యి.
మా వాళ్లు చాలా మంది ఉన్నారు అని కూడా కొందరు అధికారులు చెబుతున్నారు. వెరసి అమరావతి ప్రాంతంలో ఉద్యోగాలు చేసేవారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. విశాఖపట్నం ఎలా వెళ్లాలి? వెళ్లి అక్కడ ఎలా ఉండాలి? ఈ తికమకలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు.
గతంలో లాగా అనునయించి చెప్పే పరిస్థితి లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత కలవరం కలిగిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులం, అదీనూ సచివాలయ ఉద్యోగులం అనే తేడాలేకుండా చిల్లర దుకాణాలలో పని చేసే రోజు వారీ కూలీలను చూసినట్లు తమను చూడటం వారిని మరింత బాధేస్తున్నది. తమను బదిలీ చేస్తున్నట్లు ఆర్డర్ ఇస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు కానీ వారి మొర ఆలకించే నాధులు లేడు. వెళ్లి పోవాల్సిందే అంతే అంటున్నారు.