పల్నాడు జిల్లా కేంద్రం అయిన నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకూ బలం పుంజుకుంటున్నది. ఒక్క ఛాన్సు పిలుపుతో మోసపోయి గత ఎన్నికలలో వైసీపీకి ఓటు వేసిన తటస్థులు ప్రస్తుతం ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 2014లో పొత్తులో భాగంగా నరసరావుపేట ను బీజేపీకి కేటాయించారు. పొత్తులో భాగంగా ఆయా పార్టీల నాయకుల సమన్వయ లేకపోవడం, డాక్టర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నుంచి పోటీ చేయడం, బిజెపి ప్రచారానికి సమయం లేకపోవడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కొంత సానుభూతి తదితర అంశాల కారణంగా నరసరావుపేటలో బిజెపి ఓడిపోయింది.
2019లో తెలుగుదేశం పార్టీ స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు టిక్కెట్ కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసీపీ గాలి కారణంగా నరసరావుపేటలో వైసిపి అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. అయితే ఓడిపోయిన నాటి నుంచి కూడా డాక్టర్ చదలవాడ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలోనూ తిరిగి టీడీపీ కార్యకర్తల్లోనూ, అభిమానుల్లోనూ నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు.
స్థానిక అధికార పార్టీ నాయకులు చేస్తున్న అవినీతిని, అన్యాయాలను, దుర్మార్గాలను ప్రశ్నిస్తూ, వారి చర్యలకు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. అలాగే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ప్రజలకు తాము ఏం చేయబోతున్నామో వివరిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో డాక్టర్ చదలవాడపై ప్రజలకు నమ్మకం విశ్వాసం రెట్టింపు అయిందని ఇతర పార్టీల నాయకులు కూడా చెప్పుకుంటున్నారు.
మరో వైపు 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లను సాధించి అధికారాన్ని చేపట్టింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే పనితీరును గమనిస్తుంది. ఏ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదో ఆ సమాచారాన్ని పార్టీ అధినాయకత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. తమ ఎమ్మెల్యేలు ఎక్కడైనా అవినీతికి పాల్పడుతున్నారా, అన్యాయాలు చేస్తున్నారా, హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చేస్తున్నారా లేదా అని వివరాలు స్వీకరిస్తున్నారు.
ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేని వారిని పిలిచి తమ పనితీరు మార్చుకోకపోతే రానున్న ఎలక్షన్లలో టికెట్ ఇవ్వబోమని ఘాటుగానే చెబుతున్నారు. రానున్న ఎలక్షన్లలో 175 సీట్లకు గాను మంచి పనితీరు కనబరచిన 80 మంది వైసీపీ ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించి వారికి సీట్లను కన్ఫామ్ చేసినట్టు తెలిసింది. అందులో భాగంగా పలనాడు జిల్లాలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
వాటిలో మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించింది. అయితే నరసరావుపేట, చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పేర్లను ప్రకటించకపోవడం గమనార్హం. దీంతో స్థానిక ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి టికెట్టు ఇస్తారో లేదో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వేరే నియోజకవర్గంలోని ప్రముఖ వ్యాపారవేత్త నరసరావుపేట వైసిపి టికెట్ ను ఆశిస్తున్నారని కొందరు వైసిపి నాయకులు చెబుతున్నారు.
ఇప్పటికీ రెండుసార్లు వైసిపి తరుపున గెలుపొందిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికే సీటు కేటాయిస్తాయని ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎలక్షన్లకు మరో ఏడు ఎనిమిది నెలలు ఉండని ఈ సమయంలో ఏదైనా జరగవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.