పల్నాడు జిల్లా మాచర్లలో రాజకీయాలు రౌడీయిజాన్ని తలపిస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, మాచర్ల నియోజకవర్గం ఇంచార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి ఇరికించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గం ఇంచార్జ్ గా డిసెంబర్ 22, 2021 న జూలకంటి బ్రహ్మానందరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనను అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నారు.
దుర్గిలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేందుకు వైసీపీ నాయకులు గత ఏడాది జనవరి 2న విఫలయత్నం చేశారు. ఆ తరువాతి రోజు దుర్గి మండలం జంగమహేశ్వరపాడు వద్ద టీడీపీ కార్యకర్త కంచర్ల జలయ్య ను ప్రత్యర్థులు కాపుకాసి దారుణంగా నరికి చంపారు. అదే నెలలో 13న తోట చంద్రయ్యను దారుణంగా నడిరోడ్డులో గొంతు కోసి చంపారు. బ్రహ్మానందరెడ్డి మాచర్ల బాధ్యతలు చేపట్టిన వారం పది రోజుల్లోనే టీడీపీపై ఇటువంటి దాడులకు తెగపడి హత్యా రాజకీయాలకు, పల్నాడు ఫ్యాక్షన్ కు తెర తీశారు.
వరుసగా టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ పిన్నెల్లి బ్రదర్స్ తమ దౌర్జన్యకాండ సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబరు 16 న తెలుగుదేశం ఆధ్వర్యంలో మాచర్ల టౌన్ లో తలపెట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఇంఛార్జ్ బ్రహ్మానందరెడ్డిపై, ఇతర తెలుగు దేశం సీనియర్ నాయకులపై రాళ్ళు రువ్వి కర్రలతో వైసీపీ నాయకులు దాడికి దిగారు.
మాచర్ల మున్సపాలిటీ చైర్మన్ తురక కిషోర్ ఆధ్వర్యంలో సాగిన ఈ దౌర్జన్యకాండను చూసిన దేశం మొత్తం నివ్వెరబోయింది. బీహార్ కన్న దారుణంగా దాడులకు తెగపడి మాచర్ల లో మరిచిపోయిన ఫ్యాక్షన్ ను తిరిగి గుర్తు చేశారు. ఈ ఘటనలో తెలుగు దేశం నాయకులు తీవ్రంగా గాయపర్చడమేకాక.. వారి ఆస్తులను సైతం ధ్వసం చేశారు. తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. ఈ కేసులో వైసీపీ నాయకులను తప్పించి కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు.
తాజాగా నెల రోజుల క్రితం అంటే ఆగస్టు 29న నియోజకవర్గంలోని వెల్దూర్తి మండలం గొట్టిపాళ్ళలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో పలువురు టీడీపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇళ్ళలోకి జొరపడి మరి అడ్డొచ్చిన మహిళలను కొట్టి చిన్నపిల్లను కూడా గాయపర్చి మరో టీడీపీ నేతలను గొడ్డలితో నరికి గాయపరిచారు. ఈ ఘటనలో కూడా తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలపైనే కేసులు పెట్టారు.
వైసీపీ నుంచి కొంత మందిని అదుపులోకి తీసుకున్నా స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో వెంటనే వదిలేశారు. టీడీపీ వాళ్ళపై 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో ఎక్కడా లేకపోయినా కూడా బ్రహ్మానందరెడ్డిని ఈ కేసులో ఏ12 గా చేర్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన తిరుపతిలో ఉన్నారని సాక్ష్యాలు చూపుతున్నా కూడా అక్రమంగా కేసు నమోదు చేసి జైలుకు పంపేందుకు స్థానిక ఎమ్మెల్యే పీఆర్కే కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.