శుక్రవారం నెలవంక కనిపించడంతో రేపటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కాబోతున్నది. నెల రోజుల పాటు ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నందున ప్రార్ధనలు ఇంట్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లోనే నమాజు చేయాలని ముస్లింలకు ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపురి మసీదు షాహీ ఇమామ్లు కూడా పిలుపునిచ్చారు.
రంజాన్ మాసంలో కరోనా వైరస్ వ్యాపించకుండా ముస్లింలు సహకరించాలని పలువురు కోరారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు బయటికెళ్లి ‘రంజాన్’ సామాగ్రిని తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి తరావీహ్ నమాజ్లు ప్రారంభం అయ్యాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు.