నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అక్కంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కోన మేకల వారి గూడెం వద్ద నేషనల్ హైవే పక్కన 60 లక్షల రూపాయల ప్రభుత్వ ధనంతో నిర్మించిన దొండ మార్కెట్ ను వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి , రాష్ట్ర యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ నాయక్ అన్నారు.
రెండెకరాల 19 గుంటల ప్రభుత్వ స్థలంలో జిల్లాలోని ఎక్కువగా పండిస్తున్న దొండకాయలను మార్కెట్ చేయడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన మార్కెట్ కు ఫెన్సింగ్ లేకపోవడం వలన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అన్నారు.
ప్రహరీగోడ కట్టకపోవడం వల్ల ప్రైవేటు వ్యక్తులు కొంతభాగాన్ని ఆక్రమించారని, మార్కెట్ కు కేటాయించిన స్థలాన్ని మొత్తాన్ని వెంటనే ఫెన్సింగ్ చేయాలని కబ్జాకు గురి కాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు.
అలాగే మధ్య దళారుల వల్ల దోపిడికి గురవుతున్న రైతులను కాపాడాలి అంటే మార్కెటింగ్ శాఖ వారుస్వయంగా రంగంలోకి దిగి దొండకాయలను కొని మార్కెట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
అలాగే ప్రభుత్వం ధాన్యాన్ని, విజయ డైరీ ద్వారా పాలను ఏ విధంగా అయితే కొంటుందో మార్కెటింగ్ శాఖ వారు కూరగాయలు కూడా కొని రైతులను ఆదుకోవాలని ,వెంటనే మార్కెట్ ను ప్రారంభించాలని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వచ్చి రిబ్బన్ కట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది, అయినా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనే సోయి అధికార పార్టీ ఎమ్మెల్యేకు లేకుండా పోయిందని కళ్యాణ్ నాయక్ అన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మలిగి రెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు ఏరెడ్ల యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.