ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మూడేళ్ల పరిపాలన తరువాత ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత మళ్లీ చంద్రబాబుకు మహత్తర అవకాశంగా మారింది. పరిపాలనాపరంగా చేసిన తప్పులే కాకుండా, ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకపోవడం, ప్రజలను కలవకపోవడం, ప్రజల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం తదితర కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టింది.
గుంటూరు జిల్లా పెద కాకానిలో నిర్వహించిన ప్లీనరీ సక్సెస్ అయిందని వైసీపీ సోషల్ మీడియాలో సమాచారాన్ని ఆ పార్టీ నాయకులు గుప్పించారు. అదే సమయంలో చంద్రబాబునాయుడి సభలకు జనం రావడం లేదని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే దానికి కూడా స్పందన రావడం లేదు.
గత ఆరు నెలల నుంచి పరిస్థితిలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. తమకు ఎదురులేదని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిడిపిని చిత్తు చిత్తు చేస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా నేతలు ప్రస్తుతం నోరు మెదపడం లేదు. సీఎం జగన్ చేస్తున్న తప్పులను వెతికిపట్టుకుంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారం తో ప్రజలు భారీ ఎత్తున ఆకర్షితులవుతున్నారు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీకి గతంలో వచ్చిన ఫలితాలు రావని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
గత ఎన్నికల్లో ఘోరపరాజయానికి గురైన రాయలసీమ ప్రాంతంలో టిడిపికి మళ్లీ ఇప్పుడు ప్రజల్లో విశేష స్పందన కనిపిస్తున్నది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో టిడిపి కేవలం మూడు స్థానాలు మాత్రమే సాధించింది. మొత్తం 52 స్థానాలు ఉన్న రాయలసీమలో మూడు స్థానాలు గెలవడమంటే ఈ ప్రాంతంలో దాదాపు తెలుగుదేశం పరిస్థితి తుడిచిపెట్టుకుపోయినట్లేనని అందరూ భావించారు.
రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉంటే రెండు జిల్లాలో టిడిపికి ఒక్క సీటు కూడా రాలేదు. ఇటువంటి ఫలితాలు సాధించిన ఈ ప్రాంతంలో మళ్లీ టిడిపి పుంజుకోవడం అసాధ్యమని నిన్న మొన్నటి వరకూ రాజకీయ పరిశీలకులు భావించారు. ఆ తర్వాతి కాలంలో జగన్, సంబంధిత వ్యక్తులు తెలుగుదేశం పార్టీపై పూర్తి అణచివేత విధానాలను అవలంబించడంతో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునేవారు కూడా ఇంత కాలం అక్కడ కరవయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.
ఎన్నికల ముందు ఎన్నో హామీలు….అధికారంలోకి వచ్చినాక….
ఎన్నికలకు ముందు రాయలసీమకు ఎన్నో వాగ్ధానాలను చేసి, ఎన్నికల్లో గెలిచిన తరువాత ఒక్క హామీనీ నెరవేర్చకపోవడంతో ప్రజలు ‘జగన్’ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ప్రభుత్వం చేసిన తప్పులను ‘చంద్రబాబు’ ప్రస్తుతం క్యాష్ చేసుకుంటున్నారు. మదనపల్లి, రాజంపేట ప్రత్యేక జిల్లాలు కాకపోవడం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.
అదే విధంగా ‘నగరి’ విషయంలోనూ జరిగింది. రాయలసీమ పర్యటనలో టిడిపి అధినేత చంద్రబాబుకు ప్రజలు ఈ విధంగా బ్రహ్మరథం పడతారని ఎవరూ వూహించలేదు. రాయలసీమ జిల్లాల ప్రజల ఆకాంక్షలను తెలుసుకుని తాము అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాల విభజనలో జరిగిన తప్పులను సరిదిద్దుతానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి వారిని ఆకట్టుకుంటున్నారు.
అదే విధంగా చేనేత కార్మికులు అధికంగా ఉన్నచోట వారికి టెక్స్టైల్స్ పార్కు, 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని భరోసా కల్పించారు. రంగుల ఫ్యాక్టరీల వల్ల నీటి కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. అగ్నికుల క్షత్రియులను బీసీలుగా గుర్తించడం, నల్లబెల్లంపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసి చెరుకు రైతులను ఆదుకుంటామని ఆయన ఇచ్చిన హామీలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
మూడేళ్ల క్రితం తాము అడిగినవాటినీ, అడగవాటినీ చేస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం తమను పలకరించడంలేదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కడప జిల్లాలోని అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన బాధిలకు న్యాయం చేయకపోవడం, స్టీల్ప్లాంట్, ఇతర పరిశ్రమలను తీసుకురాకపోడం వంటి జగన్ తప్పులను చంద్రబాబు క్యాష్ చేసుకుంటున్నారు.