పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు రానీయకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాగానిదేనని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. ఈ నెల 18వ తేదీన శివరాత్రిపండుగ, కోటప్పకొండ తిరునాళ్ల నేపథ్యంలో చిలకలూరిపేట నుంచి కొండకు వెళ్లే రోడ్లను మంత్రి విడదల రజిని శనివారం పరిశీలించారు.
మంత్రి వెంట కలెక్టర్ లోతేటి శివశంకర్, డీఎస్పీ విజయభాస్కర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. రెవెన్యూ, ఆర్అండ్బీ, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు వచ్చారు. పురుషోత్తమపట్టణం నుంచి యడవల్లి వరకు కోటప్పకొండ రోడ్డును మంత్రి విడదల రజిని పరిశీలిస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటప్ప కొండ తిరునాళ్లకు భక్తులు చిలకలూరిపేట నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్తారని చెప్పారు. కోటప్పకొండకు భారీగా ప్రభలను తరలిస్తారని, చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే ఎక్కువగా తిరునాళ్లకు ప్రభలు వెళ్తాయని చెప్పారు. భక్తులకు, ప్రభలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాగానిదేనని చెప్పారు.
14వ తేదీ కల్లా పనులు పూర్తి కావాలి
ఎన్ డీబీ నిధులతో ఇప్పటికే చిలకలూరిపేట నుంచి కోటప్పకొండ మీదుగా నరసరావుపేట వెళ్లే రహదారిని అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఆయా పనులు ఈ నెల 14వ తేదీ కల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలని ఆదేశాలు జారీచేశారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉండటాన్ని గమనించి వెంటనే తొలగించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.
పురుషోత్తమపట్టణం సమీపంలో హైటెన్షన్ వైర్లు వల్ల ప్రభలకు ఎలాంటి ఆటంకం ఎదురుకాకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పారు. చిలకలూరిపేట – కోటప్పకొండ రోడ్డు పొడవునా అక్కడక్కడ నిర్మిస్తూ కల్వర్టు పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. 24 గంటలపాటు పనిచేసైనా సరే 14 వ తేదీ నాటికి రోడ్డు, వంతెనల నిర్మాణం పూర్తి చేయాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
ట్రాఫిక్ సమస్య లేకుండా చూడండి
ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తడానికి వీల్లేదని పోలీసు సిబ్బందికి మంత్రి చెప్పారు. గతేడాది చిలకలూరిపేట రోడ్డులో ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చాలా బాగా పనిచేశారని, ఇదే వ్యూహాన్ని ఈ సారి కూడా అమలు చేయాలని చెప్పారు. అధికార యంత్రాంగం బాగా పనిచేసిందని ప్రజలంతా మెచ్చుకునేలా పనితీరు ఉండాలన్నారు. వాహనాల మళ్లింపు పకడ్బందీగా ఉండాలని చెప్పారు.
చిలకలూరిపేట- కట్టుబడివారిపాలెం రహదారి జంగిల్ క్లియరెన్సు పనులు కూడా త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. ఈటీ జంక్షన్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి వెంట అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.