అనంతపురంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం పోలీసులు అడ్డుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ రాయలసీమ స్టీరింగ్ కమిటీ మెంబర్ నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్డి కులస్తులకు “రియల్ హీరో” అని బ్రిటిష్ వారిని తన ధైర్య సాహసాలతో ఎదుర్కొన్న దీరుడని అలాంటి మహనీయుని విగ్రహ ఆవిష్కరణ జరగనీయకుండా అడ్డుకోవడం యావత్ రెడ్డి కులాన్ని అవమానపరచడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత స్వాతంత్ర సంగ్రామానికి 10 సంవత్సరాల ముందే బ్రిటిష్ దుష్ట పాలనపై ఎదురు తిరిగి తిరుగుబాటు చేసిన “తెలుగు వీరుడు” ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట పటిమను గుర్తించి 1997 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ మహనీయుని జ్ఞాపకార్థం “పోస్టల్ స్టాంప్” ను విడుదల చేసిందనీ ఉయ్యాల నరసింహారెడ్డి పేరుతో ఇటీవల కాలంలో సినిమా విడుదల చేయడం ఆయన పోరాట పటిమకు నిదర్శనం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం అనుభవిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణను పోలీసులు అడ్డుకున్న సంఘటన కనబడలేదా అని నిలదీశారు.
రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు చాలా మంది ఇతర సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుల విగ్రహ ఆవిష్కరణకు పిలవకపోయినా వెళ్తూ ఉంటారు వర్దంతులకు, జయంతులకు గొప్ప వ్యక్తుల విగ్రహాలకు పూలమాలలు వేస్తారు అది చాలా మంచి సాంప్రదాయమే ఇతర కుల ప్రముఖులను రెండు చేతులు జోడించి నమస్కరించాలి అలాంటి సంస్కృతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం,కానీ నేటితరం “కల్తీ రాజకీయ నాయకులు” కేవలం పబ్లిసిటీ కోసం,ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల కోసం సీట్ల కోసం మాత్రమే వస్తున్నారని అన్ని కులాల వారికి అర్థమైపోయిందన్నారు.
రాష్ట్రంలోని కొంతమంది ప్రజా ప్రతినిధులు తమ పేరులో రెడ్డి అని పెట్టుకొని ఎన్నికల సమయంలో ఓట్లు అడుక్కునే పెద్ద మనుషులు తమ సామాజిక వర్గానికి “బ్రాండ్ అంబాసిడర్” గా ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణకు రాకపోగా పోలీసులచే అడ్డుకోవడం యావత్ రెడ్డి జాతికి అవమానకరమన్నారు. అనంతపురంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలోని రెడ్డి సామాజిక మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు పాల్గొని రాష్ట్ర రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆవిష్కరించని పక్షంలో రాబోవు ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంమంతా కలసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆత్మ శాంతించేలా “రిటర్న్ గిఫ్ట్” ఇస్తుందని నవీన్ హెచ్చరించారు.