ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. ఈ మేరకు జిల్లాకు చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఆరోజు నుంచీ నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ 25వ తేదీ అని, 26న నామినేషన్లను పరిశీలించడం జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 29వ తేదీ అని, మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుందని, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.
నామినేషన్ల స్వీకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలను వివరించారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే నామినేషన్లను అనుమతించడం జరుగుతుందన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలని, నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు.
పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించబడదన్నారు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చన్నారు. 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయని, 5 మంది వ్యక్తులు (అభ్యర్థితో సహా) ఆర్ఓ ఆఫీస్లోకి ప్రవేశించవచ్చన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుందని చెప్పారు. పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుందని అన్నారు.జిల్లాకు ఎన్నికల పరిశీలకులు వస్తున్నారని, వారి వివరాలను పత్రికల ద్వారా తెలియజేస్తామని, ఎన్నికల ఫిర్యాదులను వారికి చెప్పవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, డి ఆర్ ఓ అనిత, వై.ఎస్.ఆర్ పార్టీ నుండి రొంగలి పోతన్న, బి.ఎస్.పి నుండి సోములు, ఐ ఎన్ సి నుండి రమేష్ కుమార్, టిడిపి నుండి నరసింహ రాజు పాల్గొన్నారు.