ఏపీ లో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. చంద్రబాబు అరెస్ట్..టీడీపీ, జనసేన పొత్తుతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. బీజేపీ మూడ్ పైన క్లారిటీ వచ్చింది. ఈ సమయంలో పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం ఏర్పాటు చేసారు. ఆయన త్వరలో ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ప్లాన్ బీ అమలుకు ముఖ్యమంత్రి జగన్ సిద్దమయ్యారు. కీలక నిర్ణయాల ప్రకటనకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు.
ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ వీరితో కలిసి వస్తుందా రాదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని పెడన సభలో చెప్పిన పవన్..తరువాత తాను ఎన్డీఏలోనే ఉన్నానని స్పష్టం చేసారు. ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన పాలనా పరమైన అంశాలతో పాటుగా రాజకీయ వ్యవహారాలు..చంద్రబాబు అరెస్ట్ తరువాతి పరిణామాల పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పుడు జగన్ ఎన్నికల కదన రంగంలోకి దిగేందుకు సిద్దమయ్యారు.
ఈ నెల 9న విజయవాడలో జరిగే వైసీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఎమ్మెల్యేలు,ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపిపి లు..అనుబంధ సంఘాల నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఏపీకి జగన్ ఎందుకు అవసరం అనే కార్యక్రమ నిర్వహణ పైన ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం ద్వారా ఓట్ బ్యాంక్ మరింత సుస్థిరం చేసుకొనే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా అర్హత ఉండి పథకాల్లో లేని లబ్దిదారులకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటుగా మరిన్ని కీలక నిర్ణయాల దిశగా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ అయిదు నెలల సమయం పార్టీ నేతలంతా పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇక, చంద్రబాబు అరెస్ట్ తో పాటుగా టీడీపీ, జనసేన పొత్తుతో మారుతున్న రాజకీయ లెక్కల పైన సీఎం జగన్ పూర్తి స్పష్టతతో ఉన్నారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చేలా..స్కిల్ కేసులో వాస్తవాలు…సాంకేతిక అంశాలు కాకుండా…ఎక్కడా చంద్రబాబు తప్పు చేయలేదని టీడీపీ మద్దతు దారులు చెప్పకపోవటాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను సూచించనున్నారు. ఇదే సమయంలో పొత్తుల కారణంగా మారే సామాజిక లెక్కలకు కౌంటర్ గా సీఎం జగన్ ప్లాన్ బీ తో సిద్దమయ్యారని సమాచారం. ఇప్పుడు ఢిల్లీ పర్యటనతో రాజకీయ సమీకరణం పైన స్పష్టతతో తిరిగి వస్తున్న జగన్.. ఎన్నికల రణక్షేత్రంలోకి దిగుతున్నారు.