విశాఖ మన్యంలో మావోయిస్టు దంపతులను అరెస్ట్ చేశారు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సబ్యుడు బెల్లం నారాయణస్వామి అలియాస్ నందు అలియాస్ ఆజాద్, అతని భార్య కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గంగి మాది లను విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం అద్దరవీధి వద్ద అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
చింతపల్లి ఎఎస్పీ సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా తాటిమర్రి గ్రామానికి చెందిన ఆజాద్ 35 సంవత్సరాలుగా ఉద్యమంలో పని చేస్తున్నాడు. ఇతనిపై వందకుపైగా కేసులు నమోదయ్యాయి. 20లక్షల రివార్డుకూడా ఉంది. ఇతని భార్య గంగి మాది అలియాస్ పూల్ బత్తిని.. కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేస్తుంది.
ఈమెపై ఆరు లక్షల రివార్డు, 30కిపైగా కేసులు ఉన్నట్లు చెప్పారు. గత 23 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తుందని తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎఎస్పీ చెప్పారు.