పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న కల్తీ నూనెలపై ఉక్కుపాదం మోపి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషిచేయాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ అన్నారు. స్థానిక నరసరావుపేటలోని డీబీహెచ్ పీయస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ నరసరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ మిల్లులలో వంటనూనెలు విపరీతంగా కల్తీలు చేస్తూ వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు.
తక్షణమే సంబంధిత ఆయిల్ మిల్లులపై తనిఖీలు నిర్వహించి అక్రమ, కల్తీ నూనెలు తయారుచేస్తున్న వ్యాపారులపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు మరియు కొలతలు తూనికలు,లీగల్ మెట్రాలజీ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టేలా పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆయిల్ మిల్లులలో వివిధ రకాల బ్రాండ్లతో కల్తీ నూనెలు తయారుచేసి విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యాపారం సాగిస్తున్న వ్యాపారులపై, జంతువు కొవ్వు నుండి తీసిన నూనెలు, కోళ్ళ చర్మం నుండి తీసిన నూనెలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు సమాచారముందని ఆయన తెలిపారు.
ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్న ప్రజలు క్యాన్సర్ బారిన పడతారని అంతేకాకుండా దేవాలయాలలో పూజ కొరకు ఉపయోగించే దీపారాధన నూనెలు కూడా కల్తీ చేస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తక్షణమే ఆయా వ్యాపారస్తులపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
ప్రభుత్వం నిర్దేశించిన రేట్లతో నిత్యావసరాలు అమ్మకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని నిత్యావసరాలు సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని తెలిపిన అన్ని విషయాలపై కలెక్టర్ దృష్టిసారించాలని రమేష్ కుమార్ కోరారు.