రజక సామాజిక వర్గానికి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కేటాయించకపోవడం బాధాకరమని తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్డేపల్లి సారంగపాణి అన్నారు. ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్మడెల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సారంగపాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రజకులు దాదాపు 26 లక్షల నుంచి 30 లక్షల జనాభా ఉన్నారని, దామాషా ప్రకారం ఒక్కో రాజకీయ పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సి ఉందని అన్నారు.
అయితే నిన్న ప్రకటించిన 115 బి ఆర్ ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థుల జాబితాలో రజక సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించ లేదని అన్నారు. రజక సామాజిక వర్గం రాజకీయాలకు పనికిరాదా అని ఆయన ప్రశ్నించారు. రజకులు జెండాలు మోసే వారి లాగానే చూస్తున్నారు తప్ప రాజకీయంగా శాసించే స్థాయిలో ఉన్నామని బిఆర్ఎస్ పార్టీ గుర్తించకపోవడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ బిజెపి బి ఎస్ పి పార్టీలు గుర్తించి దామాషా ప్రకారం ఐదు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరారు.
లేకుంటే తెలంగాణ రజక సంఘం నాయకులు స్వతంత్ర అభ్యర్ధులుగా ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ నల్గొండ జిల్లాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో ములుగు,జిల్లా రజక సంఘం నాయకులు వైనాల సదానందం, పాయిరాల బిక్షపతి, ఫైండ్ల శ్రీను, కుమ్మరి కుంట్ల అఖిల్ ప్రసాద్, గూడెపు సంతోష్, ఏలూరి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.