రాష్ట్ర క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులను కాదని, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారుల కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన డివోపిటి కార్యదర్శి రాధికా చౌహాన్ కు లేఖ రాశారు. త్వరలోనే వ్యక్తిగతంగా కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తాను ఆ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిని కూడా అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు సమావేశమై, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్లు తనకు తెలిసిందని చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన పోస్ట్ గురించి తప్ప, తమ గురించి పట్టించుకోవడం లేదన్న ఆవేదనలో ఐఏఎస్ అధికారులు ఉన్నట్లుగా తనకు సమాచారం ఉందని వివరించారు. ఇండియన్ రైల్వే ఆడిట్ సర్వీస్ నుంచి వచ్చిన సత్యనారాయణ ను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
గత అస్మదీయులైన ఇతర శాఖలకు చెందిన అధికారులు విజయ్ కుమార్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలకు కీలక శాఖల బాధ్యతలను అప్పగించారన్నారు. మూడు నెలల నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులకు కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వలేదని చెప్పారు. 11 మంది ఉన్నతాధికారులను కాదని తన జిల్లాకు చెందిన అధికారికి పూర్తిస్థాయి ఇంచార్జ్ డిజిపి బాధ్యతలను అప్పగించారని రఘురామకృష్ణం రాజు ఆక్షేపించారు.
సీనియర్ల ను కాదని, నేరుగా డిజిపి పోస్టు ఇవ్వడానికి వీలు లేకపోవడంతో, పూర్తిస్థాయి ఇన్చార్జ్ డిజిపిగా నియమించారన్నారు. తాను ఇదే విషయమే రెండుసార్లు యూపీఎస్సీ లో రిమైండర్ ఇచ్చానని, వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రెండుసార్లు రిమైండర్ ఇచ్చారని తెలిపారు. అయినా రూల్స్ లేవు… తొక్క లేదు అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నదని విమర్శించారు.
ఇప్పటికైనా ఐఏఎస్ అధికారులు తమని తామ కాపాడుకుంటూ, వ్యవస్థలను కాపాడాలని రఘురామకృష్ణం రాజు కోరారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రశ్నించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, తాను ఐదేళ్లపాటు ఉంటామని అయితే ఐఏఎస్ అధికారులు శాశ్వతం అని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. ఇక అందర్నీ శాసిస్తున్న సకల శాఖ మంత్రి కనీసం ప్రజా ప్రతినిధి కూడా కాదని గుర్తు చేశారు. ప్రజలందరి చేత గౌరవించబడి ఐఏఎస్ అధికారులు, తమకు ఎదురవుతున్న కష్టాన్ని కళ్ళు తెరిచి ఫిర్యాదు చేయాలని సూచించారు.