దళితబంధు మంజూరులో ఇంకనూ గ్రౌండింగ్ కాని యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ దళితబంధు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంజూరు యూనిట్లకు వంద శాతం మొత్తం వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు, లబ్ధిదారులు ఎంపిక చేసిన యూనిట్ల సేకరణకు చర్యలు వేగం చేయాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్ విషయమై చర్యలు తీసుకోవాలని, యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. గొర్రెల యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ పూర్తి చేయాలన్నారు.
గ్రౌండింగ్ అయిన యూనిట్ల నిర్వహణ విషయమై అధికారులు పర్యవేక్షణ చేయాలని, లబ్ధిదారులకు తగు సూచనలు, సహాయ సహకారాలు అందించాలని ఆయన తెలిపారు. యూనిట్ల సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. ప్రత్యేక అధికారులు క్రియాశీలకంగా వుండి, గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జెడ్పి సిఇఓ అప్పారావు, ఇడి ఎస్సి కార్పొరేషన్ శ్రీనివాసరావు, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, జిల్లా పశుసంవర్ధక అధికారి డా. వేణు మనోహర్, ఇఇ పీఆర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.