మునుగోడు ఉపఎన్నిక బరిలో ఉన్న 47 మంది అభ్యర్థుల్లో తెరాస, భాజపా, కాంగ్రెస్, బీఎస్పీలు గుర్తింపు పొందిన పార్టీలు కాగా మిగతా వారిలో ఇతర పార్టీలకు చెందిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి (ఆర్వో) జగన్నాథ్రావు, ఎన్నికల పరిశీలకులు గుర్తులు కేటాయించారు. తెరాస తమ గుర్తయిన కారును పోలిన ట్రక్కు, ట్రాక్టర్, రోడ్రోలర్ సహా పలు గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని ఇప్పటికే ఈసీని కోరిన సంగతి తెలిసిందే.
తాజా ఎన్నికలో ట్రక్కు, ట్రాక్టర్ గుర్తులను ఎవరికీ కేటాయించలేదు. రోడ్రోలర్ గుర్తును ముగ్గురు స్వతంత్రులు కోరగా లాటరీ విధానంలో యుగతులసి పార్టీ నుంచి నామినేషన్ వేసిన శివకుమార్ కొలిశెట్టికి కేటాయించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న కేఏపాల్కు ఉంగరం గుర్తు లభించింది. కాగా నామినేషన్ పత్రాలు ఆమోదం పొందిన 83 మంది అభ్యర్థుల్లో 36 మంది చివరి తమ పత్రాలను ఉపసంహరించుకున్నారు. మొత్తం 130 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో 47 తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.
ఒక్కో ఈవీఎం (బ్యాలెట్ యూనిట్- బీయూ)లో 16 మంది అభ్యర్థుల పేర్లకే అవకాశం ఉంది. ప్రస్తుతం అభ్యర్థుల సంఖ్య 47 ఉండడంతో ప్రతి బూత్లో మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి వెల్లడించారు. అభ్యర్థుల పేర్లు, గుర్తుతో పాటు, వారి ఫొటోలు కూడా ఈవీఎంలలో ఉంటాయని తెలిపారు. మూడు ఈవీఎంలకు కలిపి ఒక ‘నోటా’ గుర్తు ఉంటుంది.