కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చిన నేత సీఎం కేసీఆర్ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కొరటికల్ గ్రామంలో గౌడ ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌడ సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నేత్వత్వంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. కల్లు దుకాణాలకు లైనెస్స్ బకాయిల రద్దు, నీరా పాలసీ, నీరా కేఫ్ ఏర్పాటు, వైన్స్ లలో గౌడలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. కోకాపేటలో రూ.500 కోట్ల విలువైన భూమిని పాపన్న ట్రస్ట్కు అప్పగించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గౌడ సంక్షేమానికి పాటుపడుతున్నందున మునుగోడులోని గౌడలు టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు.
దివాలాకోరు దిక్కుమాలిన ప్రభుత్వం బీజేపీ అని అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచినం అని ఓటర్లకు చెప్పుకుంటారా? అని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను వరుసపెట్టి అమ్ముతున్న ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ అని దుయ్యబట్టారు. దేశ సైనికులను కూడా విడిచిపెట్టకుండా వారి ఉసురు తీసిన బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన పథకాలను తొలగించి వేసిందని ఆరోపించారు. దేశంలో ఒక్క వర్గం వారికైనా బీజేపీ మంచి పని చేసిందా? అని ప్రశ్నించారు. బీజేపీ చెప్పేవి నీతులు తవ్వేవి గోతులని దుయ్యబట్టారు. బీజేపీ మునుగోడులో చేసే అరాచకాలపై నిఘా పెడతామని, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇది మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికి, రాజగోపాల్రెడ్డి ధనబలానికి మధ్య పోటీ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు.