ఖమ్మం నగర పరిధిలో చేపడుతున్న పలు ఆధునికీకరణ, అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. అభివృధ్ధి పనుల పురోగతిని మంత్రి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ పనుల్లో భాగంగా పట్టణ ప్రకృతి వనాల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పంపింగ్ వెల్ రోడ్, రంగనాయకులు గుట్ట, సుందరయ్య పార్క్ ముందు, వెనుక భాగాలలో, దాల్ మిల్ వద్ద మొత్తం 5 పట్టణ ప్రకృతి వనాలు అభివృద్ధి పర్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పార్కుల్లో పిల్లల ఆట పరికరాలు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ లు, రెండు చోట్ల ఫౌంటెన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు.
పట్టణ క్రీడా ప్రాంగణాల్లో స్థానిక యువతకు ఆసక్తి గల క్రీడలకు సంబంధించి కోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఫెన్సింగ్, లైట్లు, ఆకర్షణీయమైన పచ్చదనంతో తీర్చిదిద్దుతున్నట్లు ఆయన అన్నారు. కాల్వల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పార్కుల కిరువైపుల రహదారి నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. సుందరయ్య పార్కు వెనుక వైపు డ్రైనేజి పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. కాల్వఒడ్డు, ట్రoక్ రోడ్ వీధి వ్యాపారుల దుకాణాల సముదాయం, పార్కింగ్ స్ధలాల పనులు పురోగతిలో ఉన్నట్లు, పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని, దీంతో రహదారిపై ట్రాఫిక్ సమస్యలు ఉండవని ఆయన తెలిపారు.
మురికినీటి డ్రెయిన్స్ 92 శాతం, అండర్ గ్రౌండ్ డ్రయినేజి పనులు 99 శాతం పూర్తయినట్లు ఆయన వివరించారు. మిగులు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పర్యటనలో మంత్రి ప్రాంతవాసులను కలుస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటు, పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు.